'బాహుబలి' : కొత్త థియేటర్లో అద్భుతంగా ఉంది
హైదరాబాద్: సురేశ్ ప్రొడక్షన్స్, ప్రసాద్స్ ఐమాక్స్తో కలిసి ప్రతిష్ఠాత్మకంగా విజయవాడలో నిర్మించిన 'కాపిటల్ సినిమాస్' కొత్త మల్టీప్లెక్స్ థియేటర్లో మొదటి షోగా 'బాహుబలి' చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ థియేటర్లో 'బాహుబలి' చిత్రాన్ని వీక్షించిన అనంతరం నటుడు రానా ఎంతో ఉద్వేగానికి గురయ్యారట.
ఈ థియేటర్ ప్రారంభం సందర్భంగా వరుణ్ తేజ్, సెంథిల్ కుమార్ తదితరులు రానాకు అభినందనలు తెలిపారు. ఈ థియేటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రానా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
భారతీయ సినీ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది 'బాహుబలి'. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనువాదమై దేశవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందింది. మన దేశంలో అత్యధిక స్థూల వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది.
బాహుబలి'ని స్పెయిన్లో జరుగుతున్న ఓ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. స్పెయిన్లో జరుగుతున్న సిట్గీస్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ఈ శనివారం, ఆదివారం ప్రత్యేకంగా 'బాహుబలి ది బిగినింగ్' చిత్రాన్ని ప్రదర్శించారు.
చిత్రం విడుదలై మొన్నటితోతో 100 రోజులు పూర్తయ్యింది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. చెన్నైలోని పలు సినిమా థియేటర్లలో ఆన్లైన్ బుకింగ్స్లో ఇప్పటికే హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.మరో ప్రక్క ఈ చిత్రానికి సీక్వెల్గా 'బాహుబలి-2' చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. 'బాహుబలి-2' కొత్త సెట్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో స్థల పరిశీలన చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెలిపారు. ప్రొడక్షన్ డిజైనర్ సబు సిరిల్, మకుట వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ పీట్ డ్రేపర్లతో కలిసి సెట్స్కోసం తగిన స్థలాన్ని వెదుకుతున్నట్లు పేర్కొన్నారు.

రామోజీ ఫిలింసిటీలో కొత్త సెట్స్ నిర్మాణం గురించి ప్రొడక్షన్ డిజైనర్ సాబుసిరిల్, వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ పీట్ డ్రాపర్తో సమాలోచనలు జరిపారు. అక్కడ సెట్స్ రూపుదిద్దుకోవడమే ఆలస్యం. వెంటనే చిత్రీకరణ మొదలుపెడతారు. వచ్చే నెల నుంచి చిత్రీకరణ పనులు మొదలవ్వొచ్చని తెలుస్తోంది.
రాజమౌళి తీసిన 'బాహుబలి'ని చూసిన వాళ్లంతా ఒక అద్భుతమైన సినిమాని చూసిన అనుభూతితో పాటు... పదే పదే గుర్తుకొచ్చే ఓ ప్రశ్నను కూడా ఇంటికి తీసుకెళ్లాల్సొచ్చింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్నదే ఆ ప్రశ్న. దానికి జవాబు ఎప్పుడెప్పుడు తెలుసుకొందామా అన్న కుతూహలంతో ఉన్నారంతా.
అందుకే జక్కన్న 'బాహుబలి: ది కన్క్లూజన్' కోసం ఎప్పుడు రంగంలోకి దిగుతాడా అని ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. 'బాహుబలి: ది కన్క్లూజన్'కి సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. రాజమౌళి తన బృందంతో కలిసి రంగంలోకి దిగాడు.

ఇక బాహుబలి ఇతర దేశాల్లోనూ సందడి చేసేందుకు సిద్ధమైంది. చైనాలో 'బాహుబలి'ని 5000 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల మేరకు చిత్రాన్ని ఎడిట్ చేశారు. పలు చలన చిత్రోత్సవాలకీ పంపుతున్నారు. చైనాలో ఈ చిత్రం నవంబరు నుంచి సందడి చేయబోతోంది. అక్కడ 'పీకే' చిత్రాన్ని విడుదల చేసిన ఈ స్టార్స్ ఫిలిమ్స్ సంస్థనే 'బాహుబలి'ని విడుదల చేస్తుండడం విశేషం.
'పీకే'కి చైనాలో మంచి ఆదరణ లభించింది. అదే తరహాలో 'బాహుబలి' కూడా చైనా ప్రేక్షకుల్ని అలరిస్తుందని సినీ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'బాహుబలి'. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.


Click it and Unblock the Notifications











