వరద బాధితులకు బాసట.. మరోసారి భారీ విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్, మొత్తం ఎన్ని కోట్లంటే..?
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోయాయి. ఏడాది మొత్తం కురిసే వర్షం కొద్దిగంటల్లోనే కురవడంతో వాగులు, వంకలు పోటెత్తి ఊళ్ల మీదకు వరద పోటెత్తింది. లక్షలాది ఎకరాల్లో పంట మునగగా.. అదే స్థాయిలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక విజయవాడ నగరం పరిస్ధితి వర్ణనాతీతం. 24 గంటల వ్యవధిలో కుండపోతగా కురిసిన వర్షం ధాటికి పక్కనేఉన్న కృష్ణానది, బుడమేరు వాగులు పోటెత్తి బెజవాడ మీద పడ్డాయి. పిల్లలతో కట్టుబట్టలతో మిగిలిన జనం భవనాలపైకెక్కి ప్రాణాలను రక్షించుకున్నారు. ఈ నేపథ్యంలో బాధితుల పక్షాన నిలబడి తన పెద్ద మనసును నిలబెట్టుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
తెలుగు ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ ముందుంటారు పవన్. రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆయనలో సేవా గుణం ఎక్కువ. ప్రకృతి విపత్తుల వంటి సినీ పరిశ్రమ నుంచి ముందుగా స్పందించేది పవన్ కళ్యాణే. ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎం కావడంతో తన అధికారంతో ప్రజలకు సేవ చేస్తున్నారు. అయితే అధికారులు ఇంతగా శ్రమిస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా ఆరోపణలు చేశారు. ఆయన ఐదురోజులుగా విజయవాడకే రాలేదని ఫైర్ అయ్యారు.

దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా కౌంటరిచ్చారు. తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలనుకున్నానని కానీ అధికారులు వారించడం వల్లే దూరంగా ఉన్నట్లు తెలిపారు. సహాయక చర్యల్లో అధికారులు గంటలకొద్ది శ్రమిస్తూ బాగా అలిసిపోయి ఉన్నారని పవన్ తెలిపారు. తనపై విపక్షాలు నిందలు వేయాలని తప్పించి, మరొకటి కాదంటూ రోజాకు పవన్ కౌంటర్ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ మంత్రిగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు పర్యవేక్షించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు బాసటగా నిలిచేందుకు పవన్ భారీ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సీఎం సహాయనిధికి రూ.కోటి, ఏపీ సీఎం సహాయ నిధికి రూ.కోటి.. మొత్తంగా రెండు కోట్లను పవన్ కళ్యాణ్ విరాళంగా ప్రకటించారు. తాజాగా డిప్యూటీ సీఎం మరోసారి భారీ విరాళం ప్రకటించారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నందున .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారినపడ్డ దాదాపు 400 పంచాయతీలకు ఒక్కో లక్ష చొప్పున.. మొత్తం రూ.4 కోట్లు విరాళంతగా ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలా మొత్తంగా రెండు రాష్ట్రాలకు కలిపి వ్యక్తిగతంగా రూ.6 కోట్లను విరాళంగా ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు.

ఇక మెగా కుటుంబం నుంచి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.50 లక్షలు ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన కుమారుడు , హీరో రామ్ చరణ్ కూడా రెండు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల చొప్పున మొత్తం రూ.కోటి ప్రకటించారు. మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా తెలుగు ప్రజలకు విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల చొప్పున విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











