AP Elections 2024 పవన్ కల్యాణ్పై నోరుపారేసుకొన్న రోజా.. త్రివిక్రమ్ను కూడా లాగి..!
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై మరోసారి సినీ నటి, మంత్రి రోజా సెల్వమణి మరోసారి నోరు పారేసుకొన్నారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరెత్తే సమయంలో పవన్ను ఉద్దేశించి ఘాటుగా కామెంట్లు చేశారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిపై భారీగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఆమె చేసిన కామెంట్స్పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రోజా చేసిన కామెంట్ల వివరాల్లోకి వెళితే..
గత రెండేళ్లుగా ఏపీ మంత్రి రోజా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్దం కొనసాగుతున్నది. పవన్ కల్యాణ్ను కించపరుస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు హద్దు దాటాయనే రాజకీయ నేతలు, సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేయడం తెలిసిందే. మెగా కుటుంబాన్ని టార్గెట్ చేయడం సరికాదు అని వార్నింగ్ కూడా ఇచ్చారు. రోజా తీరుపై చిరంజీవి కూడా అసహనం వ్యక్తం చేశారు.

అయితే తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని చేసిన విమర్శలపై కొన్నిసార్లు పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. నేను కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేయగలను. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వ్యక్తగత దూషణలు చేయడం సంస్కారం కాదు. ఆ విషయం డైమండ్ రాణికి అర్ధం కావడం లేదని పలు సందర్భాల్లో పవన్ సెటైర్లు వేశారు.
అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజాగా మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అండ్ కో టీమ్ను ప్రజలు నమ్మడం లేదు. వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారు. వారు కలిసి మ్యానిఫెస్టో రిలీజ్ చేసినా ఏపీ ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని అన్నారు. ఎప్పుడైతే టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించిందో అప్పుడే వైసీపీ శ్రేణులు పండగ చేసుకొన్నారు. మోదీ మీటింగ్ తర్వాత వైసీపీదే విజయమనే నమ్మకం కుదిరింది అని రోజా అన్నారు.

టీడీపీతో పొత్తు పెట్టుకొన్న జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ కేవలం 24 సీట్లు తీసుకొన్నాడు. గాయత్రి మంత్రాల మాదిరిగా 24 సీట్లు తీసుకొన్నానని చెప్పాడు. ఆశోక చక్రంలో ఊచలు అన్నారు. కానీ చివరకు 21 సీట్లకు పరిమితమయ్యాడు. 21 సీట్ల గురించి పవన్ కల్యాణ్ ఏం చెబుతాడో తెలియదు అని రోజా ఎద్దేవా చేశారు.
అయితే పవన్ కల్యాణ్ను విమర్శిస్తూ మధ్యలో త్రివిక్రమ్ శ్రీనివాస్ను లాగింది. 21 సీట్ల గురించి ఆయన ఇంకా స్క్రిప్టు రాసి ఇవ్వలేదేమో. అందుకే ఏమీ చెప్పడం లేదు అని ఆమె అన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో అని అభిమానులు, జనసేన కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా, రోజా వ్యాఖ్యలపై జనసేన నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











