సినిమా టిెకెట్లపై ఏపీ ప్రభుత్వ కీలక ఉత్తర్వులు.. జనవరి 1 నుంచి అలాగే కొనాలి!
తెలుగు సినిమా పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల విషయంలో షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలో పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో టికెట్ రేట్ను పెంచుకొనే అవకాశం ఉండేది. కానీ ఏపీలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు సినిమాటోగ్రఫి చట్టానికి సవరణ బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆన్ లైన్ టికెట్ కి సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

టికెట్ రేట్లు పెంచడం
కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో సినిమాల ప్రదర్శనలు, ప్రత్యేక ప్రదర్శనలు, పెద్ద సినిమాలకు సంబంధించిన టికెట్ రేటు పెంపు, తదితర అంశాలపై అనేక మార్పులు చేపడుతూ సినిమాటోగ్రఫీ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టిన క్రమంలో ఆ బిల్లును ఏపీ అసెంబ్లీని ఏకగ్రీవంగా ఆమోదించింది. పెద్ద సినిమాలకు సంబంధించి టికెట్ రేట్లు పెంచడం వల్ల పేద, మధ్య తరగతి ప్రేక్షకులకు వినోదం కరువు అవుతున్నది, ప్రజల బలహీనతలు సొమ్ము చేసుకోకుండా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నదని వెల్లడించారు.

జీఎస్టీకి పొంతన
సినిమా పరిశ్రమలో నిర్మాతలు చెప్పే కలెక్షన్లకు, చెల్లించే జీఎస్టీకి పొంతన ఉండటం లేదని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు సక్రమంగా రాబట్టుకొని, . పన్ను ఎగవేత జరగకుండా చర్యలు తీసుకుంటాం అని అప్పట్లో పేర్కొన్నారు. ఇక సినిమా టికెట్ల ఆన్ లైన్ విధానం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఇకపై ప్రభుత్వం ద్వారా ఆన్ లైన్ టికెట్లు అమ్మకాలు సాగించేలా జీవో నెం. 142 జారీ చేసింది.

జీవో ప్రకారం
తాజా జీవో ప్రకారం ఆన్ లైన్ టికెట్ల అమ్మకాల బాధ్యతలు ఏపీ ఎఫ్.డీ.సీ(ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్)కి అప్పగిస్తున్నట్లు జీవోలో పేర్కొంది. ఇప్పటివరకు బుక్ మై షో, జస్ట్ టికెట్స్, పేటీఎం లాంటి ఆన్ లైన్ పోర్టల్స్ ద్వారా టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే జనవరి 1 నుంచి ఐఆర్సీటీసీ తరహాలో కొత్త వెబ్ సైట్ ఒకటి రూపొందించి ఏపీఎఫ్డీసీ ఆధ్వర్యంలో టికెట్లను విక్రయించనున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ టికెటింగ్ వెబ్ సైట్ రూపొందుతోంది.

హైకోర్టులో సవాల్
మరోపక్క ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు కూడా తగ్గిస్తూ ఇటీవల జారీ చేసిన జీవోను హై కోర్టు సింగిల్ జడ్జ్ కొట్టివేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన ధరల విషయంలో కొన్ని థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టులో సవాల్ చేశాయి. దీనిపై విచారణ జరిగిన సింగిల్ జడ్జితో కూడిన ధర్మాసనం.. ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసి పాత పద్ధతిలోనే టికెట్లు విక్రయించుకోవచ్చని స్పష్టం చేసింది. కానీ థియేటర్లు ముందు సంబంధిత జేసీకి దరఖాస్తు చేసిన తర్వాత అనుమతిస్తే ధరలు పెంచుకోవచ్చని మెలిక పెట్టింది.

సోమవారం విచారణ
ఇక మరోపక్క అలాగే టికెట్ల ధరలు నిర్ణయించేందుకు కమిటీని నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఇక ఈ విషయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోని డివిజన్ బెంచ్ , విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం ఈ విచారణ జరగునుంది.


Click it and Unblock the Notifications











