ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయం.. ఏపీ సర్కారుకు షాకిచ్చిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్లో వకీల్ సాబ్ సినిమా విడుదల సమయంలో ఏర్పడిన సినిమా టికెట్ల రేట్ల సందిగ్దత ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన రేట్లకు సినిమా పెద్దలు కూడా అంగీకారం తెలిపారు. 100 కోట్లకు పైన బడ్జెట్ అయిన సినిమాలకు మరికొంత రేటు పెంచుకునే అవకాశం కూడా కల్పించడంతో ఈ సమస్య తీరిపోతుందని అనుకున్నారు. కానీ తాజాగా మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఆ వివరాల్లోకి వెళితే..

27వ తేదీకి వాయిదా
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. ఆన్లైన్ ద్వారా సినిమా టికెట్ల విక్రయం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ సినిమా టికెట్ల కొత్త ఆన్లైన్ విక్రయ విధానం మీద ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అంటూ స్టే విధించింది కోర్టు. తదుపరి విచారణ ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.

థియేటర్ల యజమానుల మీద ఒత్తిడి
నిజానికి ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్లను ఆన్లైన్ ద్వారా ప్రభుత్వమే విక్రయించేలా జగన్ ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ చట్టాన్ని కూడా సవరించింది. ప్రభుత్వమే టికెట్లు విక్రయించే విధంగా ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూపొందించబడిన ఒక పోర్టల్ ద్వారా సినిమా టికెట్లు విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు థియేటర్ల యజమానులు ఒప్పందాలు చేసుకోవాలని గత కొద్ది రోజులుగా రెవిన్యూ అధికారులు థియేటర్ల యజమానుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు.

తాత్కాలికంగా స్టే
ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ లో ప్రభుత్వ సినిమా టికెట్ల విక్రయాలు వ్యతిరేకిస్తూ బిగ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఎగ్జిబిటర్లు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. మొన్న బుధవారం నాడు విచారణ చేపట్టిన హైకోర్టు జూలై 1వ తేదీన తీర్పు ఇస్తామని తీర్పు రిజర్వ్ చేసింది. అయితే శుక్రవారం నాడు కూడా తుది తీర్పు వెలువరించకుండా ప్రస్తుతానికి కొత్త విధానం ప్రకారం ఏపీ సర్కార్ టికెట్లు విక్రయించకుండా తాత్కాలికంగా స్టే విధించింది.

ప్రధాన సమస్యగా
నిజానికి గత ఏడాది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 69 విడుదల చేసింది. జీవో నెంబర్ 69 ప్రకారం.. ఏపీ ప్రభుత్వమే సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తుంది. టికెట్ల అమ్మకంపై వచ్చిన ఆదాయాన్ని ఆ తర్వాత ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్కు ఎప్పుడు ఇస్తారు అనే విషయంలో క్లారిటీ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.

ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది
అంతేకాక ప్రభుత్వాలే నేరుగా చాలా తక్కువ ఛార్జ్ తో సినిమా టికెట్లు విక్రయిస్తే థర్డ్ పార్టీ ఆన్లైన్ టికెట్ పోర్టల్స్ భవిష్యత్ ఏంటి అనే విషయం టెన్షన్ పెట్టడంతో సదరు పోర్టల్స్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం తీర్పును రిజర్వ్ చేసి శుక్రవారం నాడు ప్రస్తుతానికి కొత్త విధానం ద్వారా టికెట్ల విక్రయం నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయం మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











