Prabhas ఆదిపురుష్పై కొత్త వివాదం.. ఆర్ట్ వర్క్ దొంగలించారంటూ ఆర్టిస్ట్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి ఆదిపురుష్. రామాయణ గాథతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అలాగే పలు విమర్శలు, వివాదాలకు కూడా నెలవైంది. రాముడు, హనుమంతుడు, రావణుడి వేషధారణపై అనేకంగా ఆరోపణలు వచ్చాయి.
పలు సంఘాలు, పూజారులు కూడా ఆగ్రహించారు. అయితే ఈ వివాదం ముగిసింది. ఇక దీని గురించి చర్చ ఏముండదని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఆదిపురుష్ పై మరో కొత్త వివాదం నెలకొంది. ఈసారి తన ఆర్ట్ వర్క్ నే దొంగలించారంటూ ఆర్టిస్ట్ ప్రతీక్ ఆరోపణలు చేశాడు.

మీమ్స్ ట్రోలింగ్: ప్రభాస్ ఫ్యాన్స్ ను విడుదలకు ముందే టీజర్ ద్వారా ఘోరంగా నిరాశ పరిచిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా టీజర్ పై అనేక రకాల కామెంట్స్ వచ్చాయి. ప్లానేట్ ఆఫ్ ది ఏప్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, పైరెట్స్ ఆఫ్ ది కరెబియన్ వంటి చిత్రాల నుంచి కాపీ కొట్టి వింత జీవులను సృష్టించారని ఆరోపించారు. ఈవిల్ డెడ్ లో ఉన్న గ్రాఫిక్స్ లా ఆ వింత జీవులేంటని మీమ్స్ తో కడిగేశారు. మళ్లీ హనుమంతుని సైన్యంలో ఒక పాత్ర టెంపుల్ రన్ గేమ్ లా ఉందన్నారు.
దర్శకుడిపై విమర్శలు: ఆది పురుష్ టీజర్ పై అనేక మీమ్స్, ట్రోల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక వీటన్నింటిపైనా డైరెక్టర్ ఓం రావత్ ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఇందులోని పాత్రల వేషధారణపై పలుసంఘాలు, పూజారులు పెద్ద ఎత్తున విమర్శించారు. రామాయణం గాథను వక్రీకరిస్తున్నారంటూ డైరెక్టర్ ఓం రావత్ పై నిప్పులు చెరిగారు. ఈ సినిమాను బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదం కొన్నరోజులకు సద్దుమణిగింది.

కాపీ కొట్టారు: ఇటీవల శ్రీ రామ నవమి సందర్భంగా ఆది పురుష్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. దానిపై కూడా పలు విమర్శలు వచ్చాయి. కానీ అంతకుముందు జరిగినంతా ట్రోలింగ్ మాత్రం జరగలేదు. ఇక ఆది పురుష్ ట్రోలింగ్ కు బ్రేక్ పడిందని అనుకుంటున్న సమయంలో తెరపైకి కొత్త వివాదం వచ్చింది. శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆర్టిస్ట్ ప్రతీక్. తన డ్రాయింగ్స్, ఆర్ట్ వర్క్ ను కాపీ కొట్టారంటూ ఆరోపించాడు.
వైఫల్యానికి అదే కారణం: ఆర్టిస్ట్ ప్రతీక్ సంఘర్ మాట్లాడుతూ "నేను ఇండియాకు చెందిన ఆర్టిస్ట్ ను. రామాయణ ఇతిహాసంలోని శ్రీరాముడి రూపం కోసం నా అన్వేషణ ప్రారంభించాను. ఇది ఏడాది క్రితమే జరిగింది. ఆదిపురుష్ లో పని చేస్తున్న ఆర్టిస్ట్ టీపీ విజయన్ నా కళను కాపీ కొట్టారు. నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాముడి రూపాన్ని ప్రదర్శించారు. ఈ ప్రాజెక్ట్ వైఫల్యానికి ఇదొక కారణం" అని చెప్పుకొచ్చారు.

ఎలా దొంగలిస్తారు: "ఆదిపురుష్ ప్రాజెక్ట్ పై పని చేసేవారికి అభిరుచి, ప్రేమ ఏమాత్రం లేవు. అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. అసలు అనుమతి లేకుండా ఒక కళకారుడి కళను ఎలా దొంగలించాలని వారికి అనిపించింది" అంటూ పలు స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ ఫేస్ బుక్ లో ఆర్టిస్ట్ ప్రతీక్ సంఘర్ ఆరోపించారు. మరి ఈ వ్యాఖ్యలపై చిత్రబృందం ఏమైనా స్పందిస్తుందో చూడాలి కాగా ఆదిపురుష్ సినిమాను జూన్ 16న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











