ముస్లిం సంస్థలతో కమల్ హాసన్ రాజీ
న్యూఢిల్లీ : ప్రముఖ నటుడు కమల్ హాసన్ 'విశ్వరూపం' చిత్రానికి సంబంధించి ముస్లిం సంస్థలతో బుధవారం రాజీపడ్డారు. '' ముస్లిం సోదరులు నా వద్దకు వచ్చి సమస్య పరిష్కారం గురించి చర్చించారు. వారికోసం ఏదైనా చేస్తానని చెప్పాను.'' అని ఆయన మీడియాకు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,ఎంపి. జె.ఎమ్. హరూన్ నేతృత్వంలో...ముస్లిం సంస్థల ప్రతినిధులతో పాటు ఈ సమావేశమైనట్లు తెలుస్తోంది. దృశ్యాలవారీగా సంభాషణల పరంగా ఖురాన్ వ్యక్తీకరణలో అభ్యంతరాలను వారు కమల్కు అందజేసినట్లు తెలిసింది. వారికి భావోద్వేగాలు ఎక్కడ దెబ్బ తిన్నాయో వివరించినట్లు తెలిసింది. ఖురాన్ను వివాదం లోనికి లాగకుండా చిత్రంలో వారికి అభ్యంతరకరమైన దృశ్యాలను తొలగించేందుకు కమల్ అంగీకరించారు.
ఈచిత్రంపై ప్రారంభం నుంచి వివాదం చెలరేగుతోంది. అందువల్ల ముస్లిం సంస్థలతో ఆయన రాజీపడక తప్పని పరిస్థితులు ఏర్పడినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. '' ఈ చిత్రం ముస్లిం వ్యతిరేకం కాదు. ఇది భారతీయ ముస్లింలను సమర్ధిస్తోంది. ముస్లిం సోదరులతో ఒక అవగాహనకు వచ్చాను. ఇక వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి తలెత్తదు.'' అని ఆయన చెప్పారు.
మద్రాస్ హైకోర్టు కూడా తనకు అనుకూలంగా తీర్పునివ్వగలదని ఆయన ఆశిస్తున్నారు. అయితే ఆయనకు ఆశాభంగం కలిగింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు చిత్రాన్ని నిలుపుదల చేయాలని కోర్టు బుధవారం ఆదేశించింది. సుప్రీంకోర్టుకు వెళితే చివరి ఆదేశాలు వారం రోజులలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











