జూనియర్ ఎన్టీఆర్ ఆఫీసుపై దాడి.. ధ్వంసం
హైదరాబాదులోని ఫిలింనగర్లోని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయంపై దాడి జరిగింది. గత అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు జూ.ఎన్టీఆర్ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిలో కార్యాయ అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో కార్యాయం వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ దాడికి కారణమేమిటనేది తెలియడం లేదు. అలాగే, ఎవరు దాడికి పాల్పడ్డారనే విషయం తెలియడం లేదు. ఈ దాడి వెనక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడైన గుడివాడ తెలుగుదేశం శాసనసభ్యుడు కొడాలి నాని వ్యవహారం వల్లనే ఈ దాడి జరిగి ఉండవచ్చుననే అనుమానాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.
కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసులోకి వెళ్లాలని నిర్ణయించుకోవడం వెనక తాను లేనని ఎన్టీఆర్ స్పష్టంగానే చెప్పారు. తాను కట్టె కాలే వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని కూడా చెప్పారు. తెలుగుదేశం పార్టీని వీడేది లేదని అన్నారు. మామ చంద్రబాబు నాయుడితో గానీ, బాబాయ్ బాలయ్యతో గానీ తనకు మనస్పర్థలు లేవని, తనకు ఎవరితోనూ మనస్పర్థలు లేవని ఆయన చెప్పారు. అయినా, జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయంపై దాడి ఎవరు చేసి ఉంటారనేది అనుమానంగానే ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ బాద్షా షూటింగ్ కోసం ఇటలీలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయంపై దాడి ఆకతాయిల పనే అని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి కార్యాలయంపైకి రాళ్లు విసిరారని చెబుతున్నారు. ఈ దాడి వెనక రాజకీయ కారణాలు లేవని జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ అన్నారు.
కాగా, కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ కార్యాయలంపై దాడి చేయించారని, నారా - నందమూరి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడానికి నాని ఆ పనిచేయించారని తెలుగుదేశం పార్టీ నాయకుడు బొండా ఉమామహేశ్వర రావు ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయంపై దాడిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండించారు.


Click it and Unblock the Notifications











