‘టి’సెగ...వరంగల్లో ‘అత్తారింటికి దారిలేదు’!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రానికి తెలంగాణ సెగ తగిలింది. ఈచిత్రాన్ని వరంగల్లోని ఏషియన్ థియేటర్ వద్ద కొందరు తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ చిత్రాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల థియేటర్ల వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేసారు.
సినిమాను అడ్డుకుంటామని ఉస్మానియా జేఏసీ రెండు రోజుల క్రితమే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి సమైక్య పోకడలకు నిరసనగా తమ్ముడు నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రంపై తమ ప్రతాపం చూపుతున్నారు.
ఈ చిత్రం ఈ రోజు వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజవుతోంది. వాస్తవానికి ఈచిత్రం అక్టోబర్ 9న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే నిన్న ఈ చిత్రం ఇంటర్నెట్లో లీక్ అవడంతో....త్వరగా విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు.
పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












