‘బాద్ షా’కు మరో అభిమాని బలి... ఈ పాపం ఎవరిది?
మరి ఈ పాపం ఎవరిది...పోలీసులదా? థియేటర్ల నిర్వాహకులదా?. 20 రోజుల గ్యాప్తో ఇద్దరు జూ ఎన్టీఆర్ అభిమానులు మరణించారు. తొలి సంఘటనలో ఆడియో వేడుక నిర్వాహకుల అత్యాశే అభిమాని మరణానికి కారణమైంది. జనసంద్రంలా ఆడియో వేడుక జరిపామని గొప్పగా చెప్పుకోవడానికి నిర్వాహకులు పరిమితికి మించిన పాసులు జారీ చేసారు. గొప్పలకు పోదామనే వారి అత్యాశకు ఒకరు బలయ్యారు.
తాజాగా జరిగిన సంఘటనలో థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా విడుదల తొలి రోజు భారీగా అభిమానుల తాకిడి ఉంటుందని తెలిసి కూడా సరైన ఏర్పాట్లు చేయక పోవడం వారి తప్పిదం కాదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాద్ షా ఆడియో వేడుకలో ఇప్పటికే ఒకరు మరణించినా... సినిమా విడుదల సందర్భంగా పోలీసులు ముందస్తుగా ఎలాంటి చర్యలు చేపట్టక పోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విలువైన ప్రాణం పోయాక ఇప్పుడు ఎవరిని నిందించి ఏం లాభం. గతంలో అనేక అనేకసార్లు థియేటర్లలో అభిమానులు తొక్కిసలాటలో మరణించిన సందర్బాలున్నాయి. ఇప్పటికీ పరిస్థితి అలానే ఉండటం విచారకరం. ఇక ముందైనా ఇలాంటి విషాద సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications












