దర్శకత్వం కోసం వెయిట్ చేస్తున్న ‘బాద్ షా’ రైటర్
దాదాపు పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో పని చేస్తున్న గోపీ మోహన్ గతంలో పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసారు. వంశీ, నువ్వు నేను చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేసిన తర్వాత రచయితగా అవకాశాలు వచ్చాయి. కానీ ఆయన లక్ష్యం మాత్రం దర్శకుడిగా మారడమే. ఈ విషయమై ఆయన ట్వీట్ చేస్తూ...'నేను ఇండస్ట్రీకి వచ్చిందే దర్శకుడవ్వాలనే లక్ష్యంతో. నా గోల్ అదే. ఈ క్రమంలో పరిస్థితులను బట్టి నేను రచయితగా మారాను' అని గోపీ మోహన్ పేర్కొన్నారు.
'మంచి ప్రాజెక్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. సమయం రాగానే నా తొలి దర్శకత్వ ప్రాజెక్ట్ మొదలవుతుంది. క్రియేటివ్ సైడ్.... రచయితగా పలువురి దర్శకుల దగ్గర పని చేయడంపై నేను చాలా హ్యాపీగానే ఉన్నాను. నా దర్శకులందరి టాలెంట్, హార్డ్ వర్క్కి రెస్పెక్ట్ ఇస్తా. దర్శకత్వం అనేది చాలా ఒత్తిడితో కూడుకున్న పని, ఒత్తిడిలను తట్టుకుంటూ సినిమాను ప్లానింగ్గా ముందుకు నడిపించాలి' అని గోపీ మోహన్ చెప్పుకొచ్చారు.
తనకు ఇంత కాలం అవకాశాలు కల్పించిన శ్రీను వైట్లకు గోపీ మోహన్ థాంక్స్ చెప్పారు. ఈ విషయమై ఆయన తన ట్విట్టర్లో ప్రస్తావిస్తూ.. 'నేను చాలా మంది దర్శకులతో సక్సెస్ ఫుల్ చిత్రాలు చేసాను. అయితే శ్రీను వైట్ల చిత్రాల వల్లనే నా టాలెంట్ వెలుగులోకి వచ్చింది. అతనికి కృతజ్ఞతలు చెబుతున్నాను. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న వైట్ల అండ్ టీంకు అభినందనలు, ఇన్ని సంవత్సరాలుగా అతనితో కలిసి పని చేసే అవకాశం ఇచ్చినందుకు థాంక్స్' అని పేర్కొన్నారు.
శ్రీను వైట్ల, గోపీ మోహన్ కలిసి గడిచిన పదేళ్లలో 8 సినిమాలకు పని చేసారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇటీవల వచ్చిన 'బాద్ షా' చిత్రం మంచి విజయం సాధించింది. వీరి కాంబినేషన్లో వచ్చిన ఢీ, దుబాయ్ శీను, వెంకీ చిత్రాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












