గవర్నర్ దంపతుల కోసం ‘బాహుబలి’ స్పెషల్ షో
హైదరాబాద్ : బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించిన 'బాహుబలి' చిత్రాన్ని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు తిలకించారు. శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్ లోని ప్రసాద్ ఫిలిం ల్యాబ్ లో ప్రత్యేకంగా ప్రదర్శించిన ఈ సినిమాను గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ తో పాటు కుటుంబ సభ్యులతో కలిసి చూశారు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమా విజయవంతంగా 3వ వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో ఈ చిత్రం షేర్ రూ. 100 కోట్లకు చేరువ కాగా, హిందీలో రూ. 70 కోట్ల మార్కును అధిగమించింది. ఇప్పటి వరకు ఏ సౌతిండియన్ సినిమా ఈ రేంజిలో కలెక్షన్లు సాధించలేదు. బాలీవుడ్ రెగ్యులర్ సినిమాలతో సమానంగా అక్కడ బాహుబలి సినిమా ఆదరణ లభిస్తుండటం ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది.
బాహుబలి పార్ట్ 1 విజయవంతం కావడంతో పార్ట్ 2 కోసం భారతీయ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'బాహుబలి' పార్ట్ -2 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై హీరో ప్రభాస్ స్పష్టత ఇచ్చారు. షూటింగ్ సెప్టెంబర్ 15 నుంచి మొదలవుతుందని తెలిపారు. పార్ట్ 2కు సంబంధించి షూటింగ్ 40 శాతం ఇప్పటికే పూర్తి చేశారు.
ప్రధాన పాత్రల మధ్య సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయింది, యుద్ధం, ఇతర కీలక సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉంది. ‘బాహుబలి-ది కంక్లూజన్' పేరుతో సెకండ్ పార్ట్ రాబోతోంది. 2016లో ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











