బాలయ్య ‘ఆదిత్య 369’ సీక్వెల్ ఆగస్టులో...
నందమూరి నట సింహం బాలయ్య నటించిన హిట్ చిత్రాల్లో 'ఆదిత్య 369' ఒకటి. 1991లో విడుదలైన ఈచిత్రం అప్పట్లో బాక్సాఫీసు వద్ద తన తడాఖా చూపింది. ముఖ్యంగా ఈచిత్రంలో బాలయ్య పోషించిన శ్రీకృష్ణ దేవరాయల పాత్రకు మంచి పేరొచ్చింది. ఇప్పటికీ ఆచిత్రం టీవీలో వస్తుందంటే ఆసక్తిగా చూసే వారు ఎందరో. అంత అద్భుతంగా ఉంటుందా ఆ చిత్రం.
తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించ బోతున్నారు. ఈచిత్ర సీక్వెల్లో నటించబోతున్నట్లు బాలయ్య గతంలోనే ప్రకటించారు. తాజాగా ఈచిత్రం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సింగితం శ్రీనివాస రావు ఈచిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కొండ కృష్ణం రాజు సమర్పణలో వినోద్ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇప్పటికే కథ చర్చలు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం ఆగస్టు నుంచి ఈచిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 10 బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని తెలుస్తోంది.
ప్రస్తుతం బాలకృష్ణ నటించిన 'అధినాయకుడు' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ మొదటి వారంలో ఈచిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాలయ్య సరసన లక్ష్మిరాయ్, సలోని నటించారు. బాలయ్య తొలి సారిగా ఈచిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈచిత్రానికి ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మాత.


Click it and Unblock the Notifications











