మమ్మల్ని మరిచిపోతారా?.. అంటూ బాలయ్య ఫైర్
గోవా: హీరో బాలకృష్ణ ఇటీవల గోవాలో జరిగిన 100వ 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-2012' కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే. వందసారి ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహించిన ఈ ఫెస్టివల్లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ప్రదర్శనకు నోచుకోలేదు. తెలుగు నుంచి పలు చిత్రాలు ఎంట్రీకి పంపినా అన్నీ తిరస్కరణకు గురయ్యాయి.
ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న బాలయ్య.... ఫిల్మ్ ఫెస్ట్వల్ నిర్వాహకులపై, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంత ప్రతిష్టాత్మకమైన వేదికపై తెలుగు సినిమా ప్రదర్శించే అవకాశం కల్పించక పోవడంపై అసంతృప్తి వెల్లగక్కారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి ప్రఖ్యాత నటులు, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన నిర్మాత రామానాయుడు, దర్శకుడు దాసరి నారాయణ రావు లాంటి ప్రముఖులను అందించి తెలుగు పరిశ్రమను పట్టించుకోక పోవడంపై ఆక్రోశాన్ని వెల్లగక్కారు.
ఈ ఈవెంట్కు ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్స్, ప్రముఖులు, నేషనల్ మీడియా హాజరైంది. బాలయ్య ఒక్కసారిగా తన స్వరం పెంచడంతో ఫిల్మ్ ఫెస్టివల్ అధికారులు షాకయ్యారు. అయినా బాలయ్య తన మనసులోని ఆక్రోశాన్ని నిర్మొహమాటంగా బయటకు వెల్లగక్కారు.
తెలుగు సినిమాకు ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో చోటు దక్కక పోవడంపై ఒక్క బాలయ్య మాత్రమే కాదు... మొత్తం తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా అసంతృప్తిగా ఉన్నారు. మరి ఇలా జరుగడం వెనక తప్పు ఎవరిది? కావాలనే తెలుగు సినిమాను పక్కన పెట్టారా? ఆ స్థాయిలో తెలుగు చిత్రాలు లేవా? అనే విషయాలపై సమీక్ష జరిగితే బాగుంటుంది.


Click it and Unblock the Notifications











