దూకుడు నిర్మాతలతో బోయపాటి-బాలయ్య మూవీ?
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఆ మధ్య వచ్చిన 'సింహా' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో వరుస ప్లాపులతో ఉన్న బాలయ్య 'సింహా'తో బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటారు. తాజాగా వీరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోందని తెలుస్తోంది.
బాలయ్యకు తగిన పవర్ ఫుల్ కథతో బోయపాటి సిద్ధం అవుతున్నారని, ఈ చిత్రానికి 'రూలర్' అనే టైటిల్ పెట్టే యోచనలో దర్శకుడు ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈచిత్ర నిర్మాణ బాధ్యతలను దూకుడు చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ వారు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
పొలిటికల్ డ్రామాగా ఈచిత్రం రూపొందబోతోందని, 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పొలిటికల్ చిత్రంగా దీన్ని ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఏది ఏమైనా ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది. బాలకృష్ణ చివరగా నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రం బాక్సాఫీసు వద్ద యావరేజ్ రిజల్ట్ ఇవ్వగా, బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'దమ్ము' చిత్రం కూడా అంతంత మాత్రంగానే నిలిచింది.
'శ్రీమన్నారాయణ' తర్వాత ఏ సినిమాకూ బాలయ్య పచ్చజెండా ఊపలేదు. రకరకాల వార్తలు వినిపిస్తున్నా ఇంతవరకూ ఏదీ అధికారికంగా ఖరారు కాలేదు. మరీ ఈ సినిమా అయినా ఫైనల్ అవుతుందో? లేదో? 2014 ఎన్నికలతో రాజకీయ తెరంగ్రేటం చేస్తున్న బాలయ్య ప్లాన్స్ ఏమిటి? అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications












