ప్రముఖ దర్శకుడి మృతి.. మంచి దర్శకుడిని, ఆప్తుడిని కోల్పోయానంటూ బాలకృష్ణ ఎమోషనల్!
టాలీవుడ్ లో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యనే అనేక మంది టాలీవుడ్ సెలబ్రిటీలు అనేక కారణాలతో మనకు దూరమవగా తాజాగా సీనియర్ దర్శకుడు శరత్ కుమార్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. అయితే ఆయన మరణంతో టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరోసారి విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన మరణ వార్తతో ఆయనతో పనిచేసిన దాదాపు అందరు టెక్నీషియన్స్ అలాగే సినీ నటులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మంచితనాన్ని, పనితీరును గుర్తుచేసుకుంటూ పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

ఎనలేని ఆసక్తి
దర్శకుడు శరత్ ఆగస్టు 25 1947వ సంవత్సరం కృష్ణాజిల్లా డోకిపర్రు అనే గ్రామంలో జన్మించారు. అయితే చదువుకునే రోజుల నుంచి ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు చూస్తూ సినిమా పరిశ్రమ మీద ఆయన ఎనలేని ఆసక్తి పెంచుకున్నారు. ఎలా అయినా సినిమాలలో రాణించాలి అనే ఉద్దేశంతో మద్రాసు రైలెక్కిన శరత్ పి సాంబశివరావు, కోదండరామిరెడ్డి వంటి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు.

సూపర్ హిట్ సినిమాలు
కోదండరామిరెడ్డి సినిమాలుగా మలిచిన అనేక నవలా బేస్డ్ సినిమాలకు పనిచేయడంతో శరత్ సూర్యదేవర రామ్మోహన్ రావు రాసిన డియర్ అనే నవలతోనే తన సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఆ డియర్ అనే నవల ఆధారంగా తెరకెక్కిన చాదస్తపు మొగుడు సినిమాతో మొదటి విజయం అందుకున్న ఆయన ఆ తరువాత సుమన్ హీరోగా పెద్దింటి అల్లుడు, బావ బావమరిది లాంటి సూపర్ హిట్ సినిమాలు రూపొందించారు.

బాలకృష్ణ తో
ఆ తర్వాత బాలకృష్ణ తో ఆయన చేసిన వంశానికి ఒక్కడు సినిమా సూపర్ హిట్ అయింది తర్వాత బాలకృష్ణ తో తెరకెక్కించిన పెద్దన్నయ్య కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే బాలకృష్ణతో ఆయన తెరకెక్కించిన సుల్తాన్ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా వంశోద్ధారకుడు మళ్ళీ హిట్ గా నిలిచింది.

చివరిగా
తన సినీ కెరీర్లో చేసింది 20 సినిమాలే అయినా అవన్నీ కూడా ఎక్కువగా సుమన్, బాలకృష్ణలతోనే చేశారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణతో సూపర్ మొగుడు, ఏఎన్నార్ తో కాలేజీ బుల్లోడు లాంటి సినిమాలను కూడా శరత్ తెరకెక్కించారు. చివరిగా శ్రీహరి హీరోగా తెరకెక్కిన ఎవడ్రా రౌడీ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత సినిమాలకు దూరమైన ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టుకోలేదు.
Recommended Video


నన్ను బాధించింది
ఇక శరత్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఆయనతో కలిసి పనిచేసిన నందమూరి బాలకృష్ణ సుమన్ వంటి వారు తమ సంతాపం వ్యక్తం చేశారు. ఇక ప్రముఖ సీనియర్ దర్శకుడు శరత్ మృతి పట్ల నందమూరి బాలకృష్ణ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఆయన నాకు మంచి ఆప్తుడు. పరిశ్రమలో మంచి మనిషిగా పేరుతెచ్చుకున్నారు. ఆయనతో నేను 'వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, వంశోద్ధారకుడు' సినిమాలు చేశాను. ఈరోజు ఆయన మరణవార్త నన్ను బాధించింది. మంచి మనిషి, నిస్వార్థపరుడు, ఆప్తుడిని కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











