సమాజం అంటే వ్యక్తి, కులం, మతం కాదు....సంతోషం నడివీధిలో దొరకదు: బాలయ్య లేఖ హాట్ టాపిక్
Recommended Video

ఓ వైపు నూతన సంవత్సర ఆరంభం, మరో నాలుగు రోజుల్లో సంక్రాంతి సంబరాలు మొదలు కావడంతో పాటు జనవరి 12న తాను నటించిన 'జై సింహ' సినిమా విడుదల కానున్న నేపథ్యంలో బాలయ్య తెలుగు ప్రజలకు, తన అభిమానులకు ఓ లేక రాశారు. ఆ లేఖలో బాలయ్య పేర్కొన్న వివరాలు హాట్ టాపిక్ అయ్యాయి.

శుభాకాంక్షలు తెలుపుతూ...
నలుదిశాలా ఉన్న నా తెలుగు ప్రజలకి, ఇంటింటా ఆదరించే నా అభిమాన సోదరులకి, వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.... అంటూ బాలయ్య తన లేఖ మొదలు పెట్టారు.

జీవితాలు మారుతాయన్న సంబరం
నెల గడిచి, కొత్త నెల రాగానే జీతాలొస్తాయన్న ఆనందం, సంవత్సరం పూర్తయి, కొత్త సంవత్సరం రాగానే జీవితాలు మారుతాయన్న సంబరం! ఇది ప్రతి మనిషికీ ఉన్న స్వభావం. ఆ ఆశలకి ఊపిరి పోస్తూ, ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తున్నాను.... అని బాలయ్య పేర్కొన్నారు.

సమాజం అంటే వ్యక్తి కాదు, వృత్తి కాదు, కులం కాదు, మతం కాదు
సమాజం అంటే వ్యక్తి కాదు, వృత్తి కాదు, కులం కాదు, మతం కాదు... ఒకరికొకరు తోడుగా ఉండాలన్న మనస్తత్వం, సాటి మనిషికి అండగా నిలవాలన్న మానవత్వం కలగలిపిన మానవ సమూహమే సమాజం... అని బాలయ్య తెలిపారు.

ఆ సాయం నా అభిమానులుగా మీరు కావాలి. అందరికీ ఆదర్శంగా మీరు ఎదగాలి
ఏడ్చేవాడి కన్నీళ్ళు తుడవడానికి వాడి చేతి వేళ్లు చాలు. ఏడవకుండా చెయ్యడానికి మాత్రం మరో చేతి సాయం కావాలి. ఆ సాయం నా అభిమానులుగా మీరు కావాలి. అందరికీ ఆదర్శంగా మీరు ఎదగాలి. కొందరికైనా తోడుగా నిలవాలి.... అని బాలయ్య అభిమానులకు సూచించారు.

ఏ మంచి పనికైనా మీ ముందు నేనుంటా
మీరు చేసే ఏ మంచి పనికైనా మీ ముందు నేనుంటా. మంచికి మార్గదర్శకంగా నిలవండి. పది మంది చెప్పుకునేలా గెలవండి.... అని బాలయ్య సూచించారు.

నాన్నగారే మనకు ఆదర్శం
నాన్నగారు ‘స్వర్గీయ నందమూరి తారక రామారావు' గారే మనకు ఆదర్శం. యుద్ధం ఆయన ధ్యేయం... దైర్యం ఆయన ఆయుధం. జనం ఆయన సైన్యం..జయం ఆయన లక్ష్యం. అందుకే ఆయన పిలుపే ఓ గెలుపైంది. మన బతుకులకి ఓ మలుపైంది.... అని బాలయ్య తెలిపారు.

తెలుగు నేల అభివృద్ధికి అదే అసలైన మార్గం
నాన్నగారి పేరు నీడన నిలబడదాం. ఆ వీరుని పేరు నిలబెడదాం. ఆయన ఆశయాల్ని నిలబెట్టడం మన ధర్మం, తెలుగు నేల అభివృద్ధికి అదే అసలైన మార్గం. మన చేతులు విడిపోకూడదు మన చేతలు చెడిపోకూడదు.... అని బాలయ్య సూచించారు.

ఎవరినీ మర్చిపోను. ఏ ఒక్కరినీ వదులుకోను
హిందూపురం ప్రజలు అధికారం ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు అందలం ఎక్కించారు. ఎవరినీ మర్చిపోను. ఏ ఒక్కరినీ వదులుకోను. అందరి రుణం తీర్చుకోవడానికే అహర్నిశలూ శ్రమ పడతాను. నా బలం మీరే.. వరం మీరే.. జయం మీరే. అందరి అభివృద్ధి కోసం పాటు పడాలన్న నా సంకల్పాన్ని మీ అభిమానమే అండగా నడిపించాలి.... అని బాలయ్య ఆకాంక్షించారు.

జై సింహ గురించి
సి.కె. ఎంటర్టెన్మెంట్ష్ పతాకంపై కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో, సి. కళ్యాణ్ నిర్మించిన ‘జై సింహ' చిత్రం సంక్రాంతికి విడుదలవుతుంది. ఇందులో మీరు ఊహించని ఒక విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. తప్పకుండా ఈ చిత్రం మీ అంచనాలను, ఆనందాన్ని నిలబెడుతుంది. అద్భుతమైన విజయం సాధిస్తుంది... అని బాలయ్య అన్నారు.

నా అన్నవాళ్ల మధ్య ఉండే సంతోషం నడివీధిలో దొకరదు
కొత్త సంవత్సరం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి. నా అన్నవాళ్ల మధ్య ఉండే సంతోషం నడివీధిలో దొకరదు. సంప్రదాయాల్ని మరిచిపోకండి. ఇంటి ముందు బోగి మంటలు, కళకళలాడే రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దు మేళాలు, హరిదాసు కీర్తనలతో పండగ సంబరాలు చేసుకోండి. పిండి వంటలు, బంధుమిత్రుల కలయికతో సంక్రాంతికి ప్రతి ఇల్లూ సంతోషాలతో కళకళలాడాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను... అని బాలయ్య తెలిపారు.


Click it and Unblock the Notifications











