బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం' నిర్మాణం ఏ దశలో ఉంది?
ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో శ్రీరామరాజ్యం అనే చిత్రం ప్రారంభం కానున్నదంటూ ఆ మధ్య వార్తలు వచ్చి ఆగిపోయాయి. దాంతో చాలామంది ఈ చిత్రం పురిటిలోనే ఆగిపోయిందా అనే సందేహం వచ్చేసింది. దానికి తగ్గట్లు రకరకాల రూమర్స్ కూడా ఈ రామరాజ్యంపై రాజ్యం ఏలాయి. అయితే సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. ఇప్పటికే ఇళయరాజా సంగీతం సారధ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ఎనిమిది పాటల రికార్డింగ్ పూర్తిచేసారు. జొన్నవిత్తుల, వెన్నెలకంటి రాసిన ఈ పాటల్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీరామ్, చిత్ర, శ్రేయా ఘోషల్ ఆలపించారు.
ఈ విశేషాల్ని నిర్మాత సాయిబాబు మీడియాకు తెలియజేస్తూ "శ్రీరాముడు రాజుగా పాలించిన ఘట్టమే ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. ఉన్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. రామకృష్ణ సినీ స్టూడియోస్లో ఈ నెల 22న షూటింగ్ ప్రారంభిస్తున్నాం" అన్నారు. ఇక ఈ చిత్రంలో శ్రీరామునిగా బాలకృష్ణ, సీతగా నయనతార నటించనున్నారు. 'శ్రీరామరాజ్యం' కోసం ప్రత్యేకమైన సెట్స్ వేయిస్తున్నారు. వాటి నిర్మాణం కూడా పూర్తి కావొచ్చింది. ముళ్లపూడి వెంకటరమణ రచన చేస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.ఆర్.కె.రాజు, కూర్పు: జి.జి.కృష్ణారావు, కళ: రవీంద్ర, గ్రాఫిక్స్: కమల్ కణ్ణన్, డాన్స్: శ్రీను, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: తాండవ కృష్ణ, దర్శకత్వం: బాపు


Click it and Unblock the Notifications











