జన గండం ఉందని బాపు భయపడే వారు
విశాఖపట్నం : ఇటీవల స్వర్గస్తులైన ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు, కార్టూనిస్టు బాపుకు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం ఆంధ్ర విశ్వ విద్యాలయంలోని ప్లాటినం జూబ్లీ ఆడిటోరియంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హాజరై బాపుతో తన అనుభవాలను పంచుకున్నారు.
‘బాపు అత్యంత సున్నిత మనస్కుడని, ఆయనకు పొగడ్తలు, పురస్కారాలు, జనం అంటే భయ పడే వారని...తనకు జన గండం ఉందని చెప్పే వారని' ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పుకొచ్చారు. బాపు లాంటి గొప్ప కళాకారుడు దూరం కావడం తీరని లోటని ఆయన అన్నారు.

బాపు, రమణల స్నేహ బంధం అనిర్వచనీయమైనదని, ముక్కసూటిగా వెళ్లే బాపుని రమణ ఎప్పుడూ కాపాడేవారన్నారు. బాపు దర్శకత్వంలో వచ్చిన బుల్లెట్, సీతమ్మ పెళ్లి చిత్రాలకు తాను సంగీతం అందించినట్లు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. హనుమంతుడి మీద తనకొడుకు, బాపు కొడుకులతో ఓ యానిమేషన్ చిత్రం తీయాలనుకున్నాం, కానీ ఆ చిత్రం తీయకుండానే ఆయన వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి జి.ఎస్.ఎన్.రాజు, సెంటర్ ఫర్ పాలనీ స్టడీస్ సంచాలకులు ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.



Click it and Unblock the Notifications











