మరో సారి కరోనా బారిన పడ్డ బండ్ల గణేష్.. వెళ్ళే ముందు ఆలోచించుకోండి అంటూ ప్రకటన!
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడటం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా సినీ నిర్మాత బండ్ల గణేష్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే

వరుసగా కరోనా కేసులు
టాలీవుడ్ లో వరుసగా కరోనా కేసులు బయట పడుతూ ఉండటం సంచలనంగా మారుతోంది. ముందుగా మంచు లక్ష్మి కరోనా బారిన పడగా, తర్వాత మహేష్ బాబు కూడా తాను కరోనా బారిన పడినట్లుగా వెల్లడించారు. ఆ తర్వాత వరుసగా కరోనా కేసులు బయట పడుతూ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే నటకిరీటి రాజేంద్రప్రసాద్ కరోనా బారిన పడడంతో ఆయన కీలక పాత్రల్లో నటిస్తున్న ఎఫ్ 3 సినిమా షూటింగ్ అర్ధాంతరంగా ఆగి పోయింది.

బండ్ల గణేష్ కరోనా
రాజేంద్రప్రసాద్ మాత్రమే కాక యూనిట్ లో ఉన్న మరి కొంత మంది సభ్యులు కూడా కరోనా బారిన పడడంతో సినిమా షూటింగ్ ఎక్కడికక్కడ నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక టాలీవుడ్ లో ఒక్కొక్క కరోనా కేసు బయటపడుతోంది. తాజాగా తనకు కరోనా సోకినట్లుగా నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఆలోచించి మాత్రమే
గత మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్నానని, అయితే అక్కడి నుంచి వచ్చిన కారణంగా తాను కరోనా టెస్ట్ చేయించు కోవడంతో తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని లక్షణాలు కాస్త కనిపిస్తున్నాయి అని చెప్పుకొచ్చిన ఆయన తనకు కరోనా వచ్చింది కానీ తన కుటుంబానికి మాత్రం లేదని వారికి నెగిటివ్ అని వచ్చింది అని ఆయన వెల్లడించారు. అలాగే బయటకు వెళ్ళే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని ఆలోచించి మాత్రమే బయటకు వెళ్లాలని బండ్ల గణేష్ ఈ సందర్భంగా కోరారు. ఆయన కరోనా సోకడం ఇది రెండోసారి, మొదటి సరి వచ్చినప్పుడు ఆయనకు చాలా సీరియస్ అయింది.

తర్వాత నటుడిగా
సినీ ఇండస్ట్రీలోకి మేనేజర్ గా అడుగు పెట్టిన బండ్ల గణేష్ ఆ తర్వాత నటుడిగా మారారు. తర్వాత కమెడియన్గా కొన్ని సినిమాలలో కనిపించారు. తర్వాత ఆయన ప్రొడ్యూసర్ గా మారి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రొడ్యూసర్ గా మారి అనేక సూపర్ హిట్ సినిమాలు అందుకుని మంచి లాభాలు కూడా పొందారు. ఆంజనేయులు సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిన ఆయన ఆ తర్వాత తీన్మార్, గబ్బర్ సింగ్, బాద్షా, ఇద్దరమ్మాయిలతో, నీ జతగా నేనుండాలి, గోవిందుడు అందరివాడేలే, టెంపర్ సినిమాలు నిర్మించారు. ఇందులో కొన్ని సినిమాలు సూపర్ హిట్ గా మారగా కొన్ని సినిమాలు ఫ్లాప్లు మూటగట్టుకున్నాయి.

డేగల బాబ్జీ
ప్రస్తుతానికి ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మళ్లీ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించగా ఆయన మంచి కథ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక చివరిగా క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో కనిపించిన ఆయన మళ్లీ సినిమా తెరమీద కనిపించనని చెబుతూనే హీరోగా ఒక సినిమా మొదలు పెట్టారు. ఆయన హీరోగా డేగల బాబ్జీ అనే సినిమా రూపొందుతోంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఒక సినిమాను తెలుగులో డేగల బాబ్జీ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications