ఆ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడు.. ఉత్తమ చిత్రం రక్తం
ముంబైలోని లోనావాలాలో ఇటీవల ప్రతిష్టాత్మకంగా జరిగిన వరల్డ్ సినీ ఫెస్ట్ లిఫ్ట్ ఇండియా ఫిల్మోత్సవంలో రక్తం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా తెలుగు బెనర్జీ అవార్డును అందుకున్నారు. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత రాజేష్ టచ్ రివర్ రూపొందించారు. సోషల్ యాక్టివిస్ట్ సునీతా కృష్ణన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడు
బెనర్జీ కావడం గమనార్హం.
విప్లవం తుపాకులతోనే సాధించాలా? లేక ప్రేమతో కూడా సాధించవచ్చా అనే సంఘర్షణతో సాగే ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠతో సాగుతుంది. ఇందులో శంకరన్న పాత్రలో విప్లవ నాయకుడిగా బెనర్జీ కనబరిచిన ప్రతిభకు చిత్రోత్సవాలలో చక్కటి ఆదరణ లభించింది. గతంలో అమెరికాలోని ఓహియోలో జరిగిన ఇండీ గేదరింగ్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో కూడా ఆయన పోషించిన ఈ పాత్రకు ప్రశంసలు దక్కాయి.

ఈ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడిగా నామినేట్ అయిన తొలి భారతీయ నటుడు బెనర్జీ కావటం విశేషం. అంతేకాక 'రక్తం' ఉత్తమ చిత్రంగా, ఉత్తమ సినిమాటో గ్రఫీ అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ ఎడిటింగ్, ఉత్తమ చిత్రం విభాగాలలో పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు నామినేట్ అయ్యింది. ఈ సందర్భంగా బెనర్జీ మాట్లాడుతూ 'ఇప్పటి వరకు 40 ఏళ్లలో 400 సినిమాల్లో నటించానని, లిఫ్ట్ ఇండియా చిత్రోత్సవానికి 40 దేశాల నుంచి 250 సినిమాలు వచ్చాయని, వాటిలో తనకే ఉత్తమ నటుడిగా గుర్తింపు దక్కడం ఆనందంగా ఉందన్నారు. తన సినిమా కెరీర్ లో 'రక్తం' చిత్రం మైలు రాయిలా నిలిచిపోయిందన్నారు. ఈ అవార్డు నటుడిగా తన బాధ్యతను మరింత పెంచింద'ని అన్నారు.


Click it and Unblock the Notifications











