నిర్మాతలను ముంచుతున్న నిబంధనలు
సిగరెట్లు ఎక్కడపడితే అక్కడ దొరికితే తప్పు కాదు కానీ.. వాటిని తెర మీద చూపించడం తప్పు అంటూ తెరపై పాత్రలు సిగరెట్లు కాలుస్తూ చూపే దృశ్యాలు నిషేధం అని నిబంధన విధించింది ప్రభుత్వం.
అలాగే, జంతువులతో సినిమా వారు తీసే కొన్ని దృశ్యాల కోసం వాటిని నానా యాతనా పెడతారు కాబట్టి వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద సినిమాలలో జంతువులేవీ ఉండరాదన్నది మరో నిబంధన.
ఈ రెండు నిబంధనలు నిర్మాతలకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారాయని తెలుగు నిర్మాతలు వాపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ ఫిలిం ఛాంబర్కు విచ్చేసిన జాతీయ జంతు సంరక్షణ మండలి చైర్మన్ ఆర్.ఎమ్. కార్గ్ను సినీ ప్రముఖులు కలుసుకుని ఈ నిబంధనలను సడలించే మార్గం చూడమంటూ కోరారు. ఇదే విషయమై కేంద్ర మంత్రి దాసరి నారాయణరావుకు కూడా విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిసింది.
జంతువులు ఉన్న దృశ్యాలు చిత్రీకరించిన కారణంగా చాలా సినిమాలు సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ లేక విడుదల కాకుండా మగ్గుతున్నాయి. సినిమాలలో జంతువులను చూపించడంపై సరైన మార్గదర్శక సూత్రాలేమీ లేవు. అలాగే జంతు సంరక్షణ మండలి ఆదేశాలు కూడా స్పష్టంగా లేవు. ఈ విషయం గురించి త్వరలో సంబంధింత మంత్రులను కలుసుకుని పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తానని కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు చెప్పారు.
ఇదే విషయమై విప్లవ చిత్రాల మేకర్ ఆర్. నారాయణమూర్తి ఆవేశంగా స్పందిస్తూ - మొదట నాన్-వెజిటేరియన్ ఆహారాన్ని తినకుండా జనాన్ని ఆపండి. జంతువులను పెంచడం, కొట్టడం అనేవి చాలా మామూలు విషయాలు. అదే క్రూరత్వం అంటే ఎలా కుదురుతుంది? అని నారాయణమూర్తి ప్రశ్నించారు.
అందరి వాదనలు విన్న చైర్మన్ కార్గ్ మాట్లాడుతూ ముంబయి హైకోర్ట్ తీర్పును తాము అమలు చేస్తున్నామని, అంతేగానీ నిర్మాతలను ఇబ్బందికి గురి చేయడం తమ ఉద్దేశం కాదని చెప్పారు. జంతువులను మామూలుగా సినిమాలలో చూపితే తామేమీ అడ్డుకోమని, కానీ జంతువులను హింసించే సన్నివేశాలు ఉంటే మాత్రం అభ్యంతరం ఉంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో నాగార్జున, అల్లు అరవింద్, కె రాఘవేంద్రరావు, సి కల్యాణ్, కె ఎస్ రామారావు, కె సి శేఖర్ బాబు, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications