బాపు అభిమానులకు ఆనందం కలిగించే వార్త
హైదరాబాద్: తన దైన శైలిలో తెలుగుదనాన్ని ఆవిష్కరించిన ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు పేరుని పద్మవిభూషణ్కు ప్రతిపాదించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవలే బాపు తుదిశ్వాస విడిచిన సంగతి విదితమే. ఆయన పేరును మరణానంతరం పద్మ పురస్కారానికి సూచించబోతున్నారు. రెండు రోజుల కిత్రం పద్మ పురస్కారాలకు ఎవరి పేర్లు ప్రతిపాదించాలనే అంశంపై కీలక సమావేశాన్ని ఉన్నతాధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని పేర్లను తుది జాబితా కోసం సిద్ధం చేశారు. సోమవారం పద్మ పురస్కారాలకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించబోతున్నారు.
ఆధ్యాత్మిక ఉపన్యాసకులు చాగంటి కోటేశ్వరరావు, శాస్త్రీయ సంగీత విద్వాంసులు నేదునూరి కృష్ణమూర్తి, ప్రముఖ సినీనటులు, ఎంపీ మురళీమోహన్ పేర్లను పద్మభూషణ్ కోసం సూచించాలని కమిటీ యోచిస్తోంది. 'ఈనాడు' దినపత్రికకు చెందిన ప్రముఖ కార్టూనిస్టు శ్రీధర్ పేరును పద్మశ్రీ పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించబోతోంది.

ఈ విభాగంలోనే సినీ నటులు కోట శ్రీనివాసరావు, కూచిపూడి నృత్య గురువు పసుమర్తి రత్తయ్యశర్మ, ప్రభుత్వ విశ్రాంత ప్రధానకార్యదర్శి మోహన్ కందా, సీనియర్ పాత్రికేయులు ఐ.వెంకట్రావు పేర్లు ఉన్నాయి. మూడు పద్మ విభాగాల్లోనూ మరికొందరి పేర్లను ప్రతిపాదించబోతున్నారు.
అలాగే... ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పేరును పద్మవిభూషణ్ కోసం ప్రతిపాదిస్తున్నారు. ఆయన రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించారు. ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి, రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) కులపతి డాక్టర్ రాజ్రెడ్డి పేర్లను పద్మవిభూషణ్కు సంబంధించిన జాబితాలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











