రామ్ గోపాల్ వర్మపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ కేసు
హైదరాబాద్: ఓ వైపు గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఊరూరా..వాడ వాడలా భక్తులంతా ఉత్సవ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇదే సరైన సమయం అనుకున్నాడో ఏమో...దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలకు తెరలేపారు. వినాయకుడిపై ట్విట్టర్ ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. చేసిన వ్యాఖ్యలన్నీ చేసి....ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణ చెబుతున్నట్లు మరో కామెంట్ కూడా చేసారు రామ్ గోపాల్ వర్మ.
రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై 'భాగ్య నగర్ గణేష్ ఉత్సవ కమిటీ'(హైదరాబాద్ నగర ఉత్సవ కమిటీ) నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. భక్తుల మనో భావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన రామ్ గోపాల్ వర్మపై కఠినమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని తమ ఫిర్యాదులో కోరారు.

గతకొన్ని రోజులు క్రితం కూడా రామ్ గోపాల్ వర్మ హిందూ దేవుళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేసారు. మల్కాజ్ గిరీ కోర్టులో పిటీషన్ దాఖలైంది. సంజయ్ అనే న్యాయవాది ఈ పిటీషన్ దాఖలు చేసారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు ఆయనపై కేసు నమోదు చేయాలని కుషాయిగూడ పోలీసులను ఆదేశించింది కోర్టు ఆదేశాలతో కుషాయిగుడా పోలీసులు వర్మ పై 295(ఏ) కింద కేసు నమోదు చేశారు. ప్రతి సందర్భాన్ని పబ్లిసిటీ కోసం వివాదాస్పదం చేసి వాడుకునే రామ్ గోపాల్ వర్మ ఇలా ప్రవర్తించడం కొత్తేమీ కాదని ఆయన ప్రవర్తన గురించి తెలిసిన వారు అంటున్నారు.


Click it and Unblock the Notifications











