లింగ సినిమాపై భట్రాజుల ఆగ్రహం: థియేటర్ వద్ద ధర్నా
హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లింగ సినిమాపై ఓ కుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లింగా సినిమాలో భట్రాజులను కించ పరిచేలా డైలాగులు ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో లింగా చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ వద్ద సోమవారం ఆ కుల సంఘం నాయకులు ధర్నా చేశారు.
భట్రాజు కుల సంఘం నాయకులు ఇదే విషయంపై ఆదివారం హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రజనీకాంత్ నటించిన లింగా చిత్రం తమిళంలో పాటు తెలుగులో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా, టాలీవుడ్ భామ అనుష్క శెట్టి నటించారు. విడుదలకు ముందు కూడా లింగా సినిమా వివాదాల్లో చిక్కుకుంది.

షుటింగ్ సమయంలోనూ లింగాకు అడ్డంకులు తప్పలేదు. రంగారెడ్డి జిల్లాలోని అనాజ్పూర్ గ్రామంలో ప్రజలు రజనీకాంత్ లింగా సినిమా షూటింగ్ను అడ్డుకున్నారు. దాని వెనక కారణమేమిటనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. రామోజీ ఫిల్మ్ సిటీలో లింగా షూటింగ్ జరుగుతోంది. లింగా షూటింగ్ కోసం చెరువులో రసాయనాలు కలుపుతున్నారని, దానివల్ల నీరు కలుషితమవుతోందని విమర్శించారు
నీటి పారుదల శాఖ నుంచి, గ్రామ పంచాయతీ నుంచి తాము అనుమతి తీసుకున్నామని సినిమా యూనిట్ చెప్పినా ప్రజలు వినలేదు. చెరువులో నీరు కలుషితమవుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామని వారన్నారు. అంతకు ముందు కూడా గ్రామ ప్రజలు ప్రభాస్ హీరోగా నటిస్తున్న బాహుబలి సినిమా షూటింగ్ను అడ్డుకుంటామని చెప్పారు. ఆ సినిమా షూటింగ్ను కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారు.


Click it and Unblock the Notifications











