Don't Miss!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆత్మకథ విడుదలైంది...ఏం రాసారో ఏంటో
ముంబై :అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చేసాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్కుమార్ ఆత్మకథను అమితాబ్ బచ్చన్, అమీర్ఖాన్ కలిసి ముంబయిలో ఆవిష్కరించారు. 'ది సబ్స్టాన్స్ అండ్ షాడో' పేరుతో రూపొందిన ఈ పుస్తకాన్ని దిలీప్కుమార్ కుటుంబ మిత్రుడు ఉదయ్ తారా నాయర్ రచించారు.
దిలీప్ కుమార్ బాల్యం, సినీ జీవితం, కుటుంబం గురించి ఇందులో ప్రస్తావించారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. దిలీప్పై పార్సూన్ జోషి రాసిన ఓ పాటను అమీర్ ఖాన్ పాడి వినిపించారు.
దిలీప్కుమార్ భార్య సైరా బాను మాట్లాడుతూ ''దిలీప్ ఆత్మకథను పుస్తకరూపంలో తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. అతని జీవితంలో అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
జితేంద్ర మాట్లాడుతూ ''నేను దిలీప్కుమార్కు పెద్ద అభిమానిని. ఆయన్ని పరిశీలిస్తూ చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో నేను పాల్గొనడం ఓ గౌరవంగా భావిస్తున్నాను'' అన్నారు.
మాధురీ దీక్షిత్ మాట్లాడుతూ ''దిలీప్కుమార్ ఓ లెజెండరీ నటుడు. ఈ పుస్తకం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఈ పుస్తకం చదివి నటుడిగా ఆయన ఎలా ప్రవర్తించారు.. కథలను ఎలా ఎంచుకున్నారు వంటి అంశాలు తెలుసుకోవాలని నేను ఆరాటపడుతున్నాను'' అన్నారు.
అమీర్ ఖాన్ మాట్లాడుతూ ''నేను యూసుఫ్ సాబ్ (దిలీప్కుమార్)కు పెద్ద అభిమానిని. ఆయనే నాకు స్ఫూర్తి. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆయన సినిమాలు చూస్తున్నప్పుడల్లా థ్రిల్ ఫీలవుతుంటాను. పుస్తకర చదివి ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుంది'' అన్నారు.
వైజయంతి మాల, జీనత్ అమన్, డానీ డెన్జోన్పా, జావెద్ అక్తర్, సలీంఖాన్, ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్, ధర్మేంద్ర, ప్రియాంక చోప్రా, సుభాష్ ఘయ్, రాజు హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ, రితేష్ దేశ్ముఖ్, కిరణ్రావ్ తదితరులు పాల్గొన్నారు.
అరవైఏళ్ల సినీ ప్రస్థానంలో దిలీప్కుమార్కు ఎదురైన అనుభవాలు, ఎంతగానో ప్రేమించిన అందాల నటి మధుబాలను చేసుకోలేక తపనపడిన వైనాన్ని...తనకంటే 22 ఏళ్లు చిన్నదైన చక్కనిచుక్క సైరాబానును పెళ్లిచేసుకున్న పరిస్థితులను స్వయంగా వివరించారు.
జుగ్ను, దేవదాసు, అందాజ్, మేలా వంటి చిత్రాల్లోని పాత్రల్లో జీవించి వాటి తీవ్రతకు మానసికంగా దెబ్బతిన్న రోజుల్లో బ్రిటిష్ మానసిక వైద్యనిపుణుడు సాయం చేసిన తీరును...ఆ తర్వాత హాస్యచిత్రాల్లో నటించడం ద్వారా సాంత్వన పొందిన నాటి అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.
హిందీ చిత్రసీమకు పెద్ద దిక్కులాంటివారు దిలీప్కుమార్. ఒక తరాన్ని ఉర్రూతలూగించిన కథానాయకుడాయన. ముఖ్యంగా విషాదాంత ప్రేమకథలపై చెక్కుచెదరని ముద్ర వేశారాయన. అందుకే ఆయన్ని 'ట్రాజెడీ కింగ్' అంటారు. ఇటీవలే ఈ బాలీవుడ్ లెజెండ్ 91వ పుట్టినరోజు జరుపుకున్నారు.
దిలీప్ వ్యక్తిగత, వృత్తిజీవితం గురించి తెలుసుకోవాలని ఈ తరం వారికీ ఆసక్తి ఉంది. అయితే పూర్తి స్థాయి సమాచారం దొరకడంలేదు. ఆ లోటు త్వరలోనే నెరవేరనుంది. దిలీప్కుమార్ ఆత్మకథతో 'సబ్స్టన్స్ అండ్ ది షాడో' పేరుతో ఓ పుస్తకం తయారయ్యింది. సబ్స్టన్స్ అంటే సారాంశం, పదార్థం, సారం.. ఇలా పలు అర్థాలు వస్తాయి.
దిలీప్ అసలు పేరు యూసుఫ్ఖాన్ని ఉద్దేశించి సబ్స్టన్స్ అని, ది షాడో అంటే దిలీప్కుమార్ అనే వెండితెర పేరును ఉద్దేశించి పెట్టినదని సమాచారం. సహనటీనటులతో తన అనుబంధం, రాజ్కపూర్, దేవానంద్ లాంటి నటులతో ఉన్న వైరం.. ఇలా పలు విషయాలను స్వయంగా దిలీప్కుమార్ చెప్పగా, రచయిత ఈ పుస్తకంలో పొందుపరిచారు. మధుబాలతో తన అనుబంధం గురించి కూడా దిలీప్ అందులో చెప్పారట.