ఆచార్య, పుష్ప కథలు తమవేనంటోన్న రచయితలు
పేరొందిన పలు సినిమాలపై వివాదాలు ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయాయి. కొందరు ఫిల్మ్ మేకర్లు మరో అడుగు ముందుకేసి ఈ వివాదాలను కూడా పబ్లిసిటీ స్టంట్ గా వాడేసుకుంటున్నారు. అయితే, అతి ముఖ్యమైన కాపీరైట్ వివాదం కూడా ఇదే బాట పట్టడం శోచనీయం. తాజాగా ఆచార్య, పుష్ప చిత్రాలు కూడా ఈ వివాదంలోనే ఇరుక్కున్నాయి.
గతంలో మహేశ్ బాబు శ్రీమంతుడు, మిస్టర్ పర్ఫెక్ట్, సర్కార్, వంటి సినిమాలకు ఈ విధమైన కాపీరైట్ సమస్యలు తలెత్తాయి. ఆ సినిమా కథలు తమవేనంటు పలువురు రచయితలు దర్శక-నిర్మాతలపై ఆరోపణలు చేశారు. తాజాగా ఆచార్య, పుష్ప సినిమాలు సైతం తమ కథలే అంటూ ఇద్దరు రైటర్లు రచ్చకెక్కారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా కథ తనదేనంటూ రైటర్ రాజేశ్ మండూరి ఆరోపిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం మైత్రీ మూవీ మేకర్లకు ఈ కథ వినిపించానని, ఇప్పుడు వారే అదే కథను కొరటాల శివకు ఇచ్చేశారని చెబుతున్నారు. 2015లో వచ్చిన శ్రీమంతుడు సినిమా దగ్గర నుంచీ కొరటాల మైత్రీ మూవీ మేకర్స్ కు అత్యంత సన్నిహితులిని తెలిపారు. అప్పుడే తాను రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ, ఆచార్య నిర్మాతలకు అనుకూలంగానే వారు తమ నిర్ణయాన్ని వెల్లడించారని తెలిపారు. కొరటాల శివ దీనిపై ఇంకా స్పందించాల్సి ఉంది.

మరోవైపు పుష్ప సినిమా కూడా ఇలాంటి వివాదంలోనే ఇరుక్కుంది. నవలకారులు వెంపల్లి గంగాధర్ ఈ చిత్రం తాను రాసిన తమిళ కూలీ అనే నవల ఆధారంగా తెరకెక్కుతోందని వెల్లడించారు. బన్నీ ఈ సినిమాలో శేషాచలం అడువుల్లో తిరిగే దోపిడీ దొంగగా కనిపించబోతున్నాడు. పూర్తి కథ గురించి తెలియకుండా రచయిత ఆరోపణలు చేస్తున్నారని చిత్ర బృందం కూడా తెలిపింది. మరి ఈ వివాదాలు ఎప్పుడు సద్దుమణుగుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











