ఆ ఐదుగురు స్టార్ల సభ్యత్వం తొలగింపు
తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ సొసైటీలో మెంబర్స్ గా ఉన్న ఐదుగురు స్టార్లను తొలగించారు. వీరంతా ముంబై వారే కావడం గమనార్హం. తొలగించ బడిన వారిలో నిన్నటితరం బాలీవుడ్ హీరో ధర్మేంద్ర సింగ్ డియోల్, హేమా మాలిని, శత్రుఘ్న సిన్హా, వీరు దేవగన్(విజయ్ దేవగన్ తండ్రి), కున్వర్ అజిత్ సింగ్ డియోల్ తదితరులు ఉన్నారు. సొసైటీ ఏర్పాటయినప్పటి నుంచి ఇప్పటి వరకు వీరు క్యాపిటల్ షేర్ చెల్లింక పోవడం, ఇప్పటి వరకు జనరల్ బాడీ మీటింగ్స్ హాజరు కాక పోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. 1981 నుంచి వీరు ఫిల్మ్ నగర్ సొసైటీలో మెంబర్స్ గా ఉన్నారు.
వారు సొసైటీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా లేరని, మేము వారిని కాంటాక్టు చేయడానికి ప్రయత్నించినా ఎలాంటి స్పందన లేదని...సొసైటీ మాజీ కార్యదర్శి మురళీ మోహన్ వెల్లడించారు. ఇక నార్త్ ఇండియన్స్ ఎవరూ సొసైటీలో మెంబర్స్ గా లేరని, అంతా తెలుగు వారే ఉన్నారని చెప్పారు. సొసైటీ భూముల కేటాయింపుల వ్యవహారంలో జరుగుతున్న గొడవపై స్పందిస్తూ...గతంలో లాటరీ పద్దతిలో ప్లాట్లు కేటాయించామని, మిగిలిన వారికి వెయిటింగ్ లిస్టు ప్రకారం కేటాయింపులు జరుపుతామన్నారు. భూకేటాయింపుల విషయంలో ఎలాంటి వివాదం లేదని, చెన్నయ్ నుంచి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తరలించినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వారందరికీ ఇక్కడ కేటాయింపులు జరిగాయని అన్నారు మెరళీ మోహన్.


Click it and Unblock the Notifications











