బ్రేకింగ్: రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు.. బాంబై హైకోర్టు నిర్ణయంతో ఊరట
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం, బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి ఊరట లభించింది. కొద్ది రోజులుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రియా చక్రవర్తి తరపున లాయర్ సతీష్ మాన్షిండే బుధవారం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై బాంబే హైకోర్టు సానుకూలంగా స్పందించింది. లాయర్ వికాస్ వాదనలకు పాజిటివ్ స్పందించి రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
Recommended Video

పలుమార్లు బెయిల్ తిరస్కరణ అనంతరం
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో భాగంగా తెరపైకి వచ్చిన డ్రగ్స్ రాకెట్ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్స్ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో అనుమానాలు బలంగా మారడంతో ఆమెను సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి రియా జుడిషియల్ కస్టడీలో ఉంటున్నారు. అప్పటి నుంచి ఓ మారు బాంబే హైకోర్టులో, పలుమార్లు ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా తిరస్కరణకు గురైంది.

బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు
ప్రస్తుతం బైకుల్లా జైలులో ఉంటున్న రియా చక్రవర్తి, మరో జైలులో ఉంటున్న షోవిక్ చక్రవర్తి తరఫున వారి తరఫున వారి న్యాయవాది సతీష్ మాన్షిండే మంగళవారం అంటే అక్టోబర్ 6వ తేదీన ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా బెయిల్ను తిరస్కరించింది. అక్టోబర్ 20వ తేదీ వరకు జుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకొన్న మరుసటి రోజే అంటే బుధవారం బాంబే హైకోర్టు రియాకు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం.

షరతులతో కూడిన బెయిల్.. పాస్పోర్టు స్వాధీనం
రియా చక్రవర్తికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్టును కోర్టుకు స్వాధీనం చేయాలని సూచించింది. అలాగే లక్ష రూపాయల బాండ్ను ఇవ్వాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. ముంబై దాటి వెళ్లాలనుకొంటే కోర్టు అనుమతి తీసుకోవాలని, ఒకవేళ కోర్టు విధించిన షరతుల్లో ఏ ఒక్కటి ఉల్లంఘించినా బెయిల్ రద్దు అవుతుందని పేర్కొన్నది. కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సతీష్ మాన్షిండే సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిజాలను, వాస్తవాలను కోర్టు నమ్మిందని ఆయన వ్యాఖ్యానించారు.

షోవిక్ చక్రవర్తి బెయిల్ పిటిషన్ తిరస్కృతి
రియా చక్రవర్తికి బెయిల్ లభించినప్పటికీ పూర్తిగా ఊరట లభించలేదు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తన సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ సిబ్బంది శ్యామ్యూల్ మిరాండా, దీపేష్ సావంత్కు కూడా బెయిల్ మంజూరు చేసింది.

రియాకు బెయిల్ ఇవ్వాలని బాలీవుడ్ వర్గాల డిమాండ్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం ఆత్మహత్యే అని ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించిన నేపథ్యంలో రియా చక్రవర్తికి బెయిల్ ఇవ్వాలని బాలీవుడ్ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. హీరోయిన్ స్వర భాస్కర్, సినీ రచయిత కనికా థిల్లాన్ బెయిల్ ఇవ్వాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు. సుశాంత్ సింగ్ మరణం విషయంలో క్లారిటీ వచ్చినందున రియాను విడుదల చేయాలని సూచించారు.


Click it and Unblock the Notifications











