ఫిల్మ్ చాంబర్ ముట్టడి... బ్రాహ్మణులతో తమ్మారెడ్డి చర్చలు
హైదరాబాద్: 'దేనికైనా రెడీ' చిత్రం వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రంలో బ్రాహ్మణులను కించ పరిచే విధంగా సన్నివేశాలున్నాయని, బ్రాహ్మణ స్త్రీ క్యారెక్టర్ను తప్పుగా చూపించారని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా హైదరాబాద్ లోని ఫిల్మ్ చాంబర్ ముందు బ్రాహ్మణ సంఘాల నేతలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కొందరు బ్రాహ్మణులు చాంబర్ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అరెస్టు చేసారు. ఆందోళన కార్యక్రమంలో పాల్గొనని కొందరు బ్రాహ్మణ యువకులను కూడా పోలీసులు అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రాహ్మణుల ఆందోళన నేపథ్యంలో ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డ భరద్వాజ వారితో చర్చలు జరిపారు. కమిటీ వేసి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరిస్తామని వెల్లడించారు.
కాగా.... చెన్నయ్ కి చెందిన బ్రాహ్మణులు మోహన్ బాబుకు మద్దతుగా హైదరాబాద్ చేరుకుని రాష్ట్రంలో బ్రాహ్మణులు చేస్తున్న చర్యలను తప్పుబట్టారు. సేవా కార్యక్రమాలు, మంచి పనులు చేస్తున్న మోహన్ బాబుకు పిండ ప్రధానం చేయడం ఏమిటని, ఇలా చేయడం ధర్మం కాదని చెబుతూ... మీడియా ముఖంగా మోహన్ బాబుకు ఆశీర్వచనాలు అందించారు.
ప్రస్తుతం దేనికైనా రెడీ చిత్రం వివాదం కోర్టు వరకు వెళ్లింది. ఇటు బ్రాహ్మణులు, అటు మోహన్ బాబు కుటుంబం ఏమాత్రం వెనక్కు తగ్గకుండా తమదైన రీతిలో ముందుకు సాగుతున్నారు. మరి న్యాయ స్థానం వద్ద ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి. కాగా... ఈ వివాదం నేపథ్యంలో మోహన్ బాబుతో పాటు దేనికైనా రెడీ చిత్రం యూనిట్ పై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











