గాయని శ్రావణ భార్గవికి తప్పిన ప్రమాదం
హైదరాబాద్: తెలుగు సినిమా గాయని శ్రావణ భార్గవికి పెద్ద ప్రమాదం తప్పింది. విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి బుధవారం ఉయదం హైదరాబాద్ నుండి బయల్దేరిన ఆమె కారు నల్లగొండ జిల్లా చిట్యాల సమీపంలో రోడ్డు డివైడర్ ను ఢీకొట్టింది. అయితే అదే సమయంలో కారు టైరు పగిలిపోవడంతో కారు బోల్తాపడకుండా అక్కడే నిలిచి పోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
కారుకు ఎదురుగా రాంగ్ రూట్లో ఓ ట్రాక్టర్ రావడంతో డ్రైవర్ దాన్ని తప్పించబోయి ఈ క్రమంలో రోడ్డు డివైడర్ ను ఢీ కొట్టారు. మొత్తానికి ఈ ఘటన నుంచి శ్రావణ భార్గవి క్షేమంగా బయట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న శ్రావణ భార్గవి భర్త హేమచంద్ర ఆమెను విజయవాడ తీసుకెళ్లారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాంగ్ రూట్లో వచ్చిన ట్రాక్టర్ డ్రైవర్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ యాక్సిడెంటు కారణంగా హైదరాబాద్-విజయవాడ హైవేపై కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే హైవే పోలీసులు అక్కడి చేరుకున్నారు.
అటు బుల్లి తెరతో పాటు, ఇటు వెండి తెరపై ప్లేబ్యాక్ సింగర్లుగా ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవి. గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ ఇద్దరు ప్రేమికుల రోజున పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి వివాహం ఫిబ్రవరి 14, 2013న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.


Click it and Unblock the Notifications











