చైతూ - శోభితలపై నెగిటివ్ కామెంట్స్ .. లెంపలేసుకున్న వేణుస్వామి, మాటపై నిలబడతానంటూ
సెలబ్రెటి జ్యోతిష్యుడు వేణుస్వామి ఇంటా బయటా విమర్శలను ఎదుర్కొంటున్నారు. కొన్నాళ్ల క్రితం వరకు ఆయన మాటపై జనానికి మంచి గురి ఉండేది. ఎందుకంటే చెప్పిన జోస్యం నూటికి నూరు శాతం రుజువయ్యేది కాబట్టి.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఏం పట్టుకున్నా మట్టే అన్నట్లుగా వేణుస్వామి పరిస్ధితి తయారైంది. వరుసగా తెలంగాణ , ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, ఐపీఎల్ తదితర విషయాలపై ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా ఫలితాలొచ్చాయి. దీనికి తోడు కొందరు హీరోల వ్యక్తిగత జీవితాలపై చెప్పిన జోస్యం కూడా తేడా కొట్టడంతో వారి అభిమానులు సోషల్ మీడియాలో ట్రోలింగ్కు దిగడంతో పాటు వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. ఈ దెబ్బకు వేణుస్వామి సైలెంట్ అయ్యారు.
తానిక జీవితంలో సెలబ్రెటీల జాతకాలు చూడనని, వారి జీవితాలపై జోస్యం చెప్పనని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. అన్న మాట నిలబడి ఉంటే ఆయనను ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ వేణుస్వామి మళ్లీ ప్రముఖలు జీవితాలలో వేలుపెట్టి.. కొరివితో తలగొక్కున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య, సమంతలు ఎవరి జీవితాల్లో వారు బిజీ అయి.. ఎవరి బతుకు వాళ్లు బతుకుతున్నారు. నాగచైతన్య మునుపటి కంటే రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన నటించిన తండేల్ సిద్ధంగా ఉంది.

అయితే సమంతతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న తమ హీరో తిరిగి పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడవ్వాలని చైతూ ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇలాంటి దశలో యంగ్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో చైతన్య ప్రేమలో పడ్డారని.. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ గాసిప్స్ వైరల్ అయ్యాయి. మొదట్లో ఎవరూ వీటిని నమ్మకపోగా.. పుకార్లుగా కొట్టేశారు కూడా. కానీ అవే నిజమయ్యాయి. నాగచైతన్య - శోభితలు సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకుని షాకిచ్చారు. వీరిద్దరి నిశ్చితార్ధాన్ని నాగార్జున కన్ఫ్ర్మ్ చేశారు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు విషెస్ తెలియజేస్తున్నారు.
చైతూ- శోభితలు నిశ్చితార్ధం చేసుకుని గంటల గడవకముందే .. వేణుస్వామి ఈ వ్యవహారంలో వేలుపెట్టాడు. వీరి జాతకం కలవలేదని, వాళ్లిద్దరూ నిశ్చితార్ధం చేసుకున్న సమయం కరెక్ట్ కాదని .. ఒక అమ్మాయి కారణంగా ఈ జంట 2027లో విడిపోతారని కామెంట్ చేశాడు. ఆ మాటలతో అక్కినేని ఫ్యాన్స్కి ఎక్కడో కాలింది.. అంతే వేణుస్వామిపై విరుచుకుపడ్డారు. శుభమా అని నిశ్చితార్ధం చేసుకుని గంటలు గడవకముందే ఆ మాటలేంటీ అంటూ ట్రోలింగ్కు దిగారు. అంతేకాదు.. శోభిత, నాగచైతన్యలపై నెగిటివ్ కామెంట్ చేసినందుకు వేణుస్వామిపై కేసులు పెట్టే వరకు వెళ్లింది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎఫ్జేఏ), తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ (టీఎఫ్డీఎంఏ)లు వేణుస్వామి ప్రెడిక్షన్ని సీరియస్గా తీసుకుని రేపు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించాయి. రేపు హైదరాబాద్ పోలీస్ కమీషనర్, తెలంగాణ డీజీపీ, తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ సభ్యులను కలిసి ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు.
అయితే తనపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో వేణుస్వామి దిగొచ్చారు. అసలు చైతూ- శోభితల జాతకంపై ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. గతంలో సమంత - నాగచైతన్య జాతకాన్ని చెప్పానని.. దానికి కొనసాగింపుగా తాజా నిశ్చితార్ధంపై స్పందించానని .. సెలబ్రిటీల జాతకం చెప్పడం మానేశానని, ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉంటానని, రాజకీయాలపై విశ్లేషణ కూడా చేయనని వేణుస్వామి స్పష్టం చేశారు. మా అధ్యక్షుడు మంచు విష్ణుకు కూడా ఇదే అంశంపై వివరణ ఇచ్చానని వెల్లడించారు. ప్రస్తుతం వేణుస్వామి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











