దొంగతనం కేసులో సెన్సార్ బోర్డు సభ్యురాలి అరెస్టు

వివరాల్లోకి వెళితే... కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలు ఒకరు తన సహోద్యోగిని ఆభరణాలను అపహరించి....పోలీసులకు దొరికిపోయారు. ఈనెల నాలుగోతేదీన జరిగిన ఈ దొంగతనం వివరాలను పోలీసులు శనివారం నాడిక్కడ వెల్లడించారు. మీనాక్షి సింగ్ అనే సెన్సారు బోర్డు సభ్యురాలు తన సహోద్యోగిని అయిన కిరణ్ శ్రీవాత్సవతో కలిసి ఒక భోజ్పురి చిత్రాన్ని నాలుగో తేదీన సెన్సార్ చేస్తున్నారు. ఒక మినీథియేటర్లో ఈ కార్యక్రమం నడుస్తుండగా...తన పక్కనే ఉన్న కిరణ్ బ్యాగులో నుంచి మీనాక్షి చాకచక్యంగా వజ్రాభరణాలను తస్కరించేశారు.
చలనచిత్రం సెన్సారు పని పూర్తయిన తర్వాత బ్యాగులో చూసుకున్న కిరణ్కు తన ఆభరణాలు పోయినట్లు తెలిసింది. వెంటనే ఆమె మీనాక్షి...మరో ముగ్గురు సభ్యులతో కలిసి అక్కడంతా వెతికారు. ఫలితం లేకపోయింది. ఇంట్లో ఏమైనా మర్చిపోయానేమోనని ఇంటికెళ్లి చూసినా దొరకలేదు. దీంతో, కిరణ్ సంబంధిత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సినిమా సెన్సారు జరిగిన మినీథియేటర్లోని సీసీటీవీ దృశ్యాల్లో మీనాక్షి అనుమానాస్పద కదలికలను గమనించిన పోలీసులు ఆమెను గట్టిగా ప్రశ్నించారు. చేసిన తప్పును మీనాక్షి అంగీకరించారు. ఆమె నివాసం నుంచి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన మీనాక్షికి బెయిలు లభించినట్లు పోలీసులు తెలిపారు.


Click it and Unblock the Notifications











