కొద్దిగంటల్లో మిస్టర్ బచ్చన్ రిలీజ్.. రవితేజకు షాక్, అతని పక్కన ఆమె వద్దన్న సెన్సార్ బోర్డ్
సాధారణంగా సినిమా కపుల్స్ ప్రేమకథలన్నీ వాళ్లు నటించిన సినిమా సెట్స్ మీదే మొదలవుతాయి. ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్లు షూటింగ్ స్పాట్లలోనే డ్యూయెట్లు పాడుకున్నవారే. ఈ ప్రేమకథల్లో పెళ్లి పీటల వరకు వచ్చినవి కొన్నే. బాలీవుడ్ నట దిగ్గజాలు అమితాబ్ బచ్చన్ - రేఖల లవ్ స్టోరీ కూడా ఈ కోవలోకే వస్తుంది. 1976లో దో అన్జానే వీరిద్దరికి తొలి సినిమా.. తొలి పరిచయం కూడా అప్పుడే . అప్పటికే అమితాబ్కు జయా బచ్చన్తో వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఇద్దరూ సన్నిహితంగా ఉన్నారని, సీక్రెట్గా పెళ్లి కూడా చేసుకున్నారని బీ టౌన్ మీడియా కోడై కూసింది. ఈ వార్తలకు బలాన్నిస్తూ నితూ - రిషి కపూర్ పెళ్లిలో పాపిట్లో కుంకుమ దిద్దుకుని, మెడలో మంగళసూత్రంతో కనిపించి షాకిచ్చారు రేఖ. కానీ ఏం జరిగిందో ఏమో కానీ అమితాబ్కు క్రమక్రమంగా దూరమవుతూ వచ్చారు రేఖ.
దశాబ్థాల నాటు జరిగిన ఈ ప్రేమ కథ ఓ తెలుగు సినిమా కారణంగా ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది, అదే మిస్టర్ బచ్చన్. మాస్ మహారాజ రవితేజ, హరీశ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న మిస్టర్ బచ్చన్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. షాక్, మిరపకాయ్ సినిమాల తర్వాత రవితేజ - హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో మిస్టర్ బచ్చన్పై భారీ అంచనాలున్నాయి.

నిజాయితీగల ఆదాయపు పన్ను అధికారి .. ఓ రైడ్కి వెళ్లిన తర్వాత ఏం జరిగింది , అతని జీవితం ఏ మలుపు తిరిగింది అనేదే ఈ సినిమా ఇతివృత్తం. ఇప్పటికే రిలీజైన మిస్టర్ బచ్చన్ పాటలు, పోస్టర్స్ , టీజర్కు మంచి స్పందన వచ్చింది. ఆదాయపు పన్ను ఎగవేత, అవినీతి బ్యాక్డ్రాప్లో భారతీయ చిత్ర పరిశ్రమలో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్కు రవితేజ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.
చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలే చూస్తూ, వాటిని అనుకరిస్తూ పెరిగిన రవితేజ.. తన సినిమా పేరును కూడా బచ్చన్ అని పెట్టుకుని పెద్దాయనపై అభిమానాన్ని చాటుకున్నారు. ఈ మూవీకి భాగ్యశ్రీ బోర్సే అందాలు ఎక్స్ట్రా అస్సెట్. రవితేజ- భాగ్యశ్రీలపై తెరకెక్కించిన రొమాంటిక్ సాంగ్స్, సీన్స్ ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీకి అవకాశాలు క్యూకడతాయని విశ్లేషకులు అంటున్నారు. తన తొలి సినిమాకే తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని మంచి మార్కులు కొట్టేసింది ఈ మరాఠీ ముద్దుగుమ్మ.

మిస్టర్ బచ్చన్ సెన్సార్ ఇటీవలే పూర్తయి.. యూ/ఏ సర్టిఫికెట్ మంజూరైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా యూనిట్కు సెన్సార్ బోర్డు కొన్ని మార్పులు సూచించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. మిస్టర్ బచ్చన్ ఓపెనింగ్ సీన్లో కనిపించనున్న అమితాబ్- రేఖల ఫోటో స్థానంలో అమితాబ్ ఆయన భార్య జయా బచ్చన్ ఫోటో పెట్టాలని సెన్సార్ బోర్డ్ సూచించినట్లుగా కథనం. అలాగే ఈ కథ ఏ వ్యక్తికి, ఏ ప్రాంతానికీ సంబంధించినది కాదని, కల్పితమనే డిస్క్లెయిమర్ ప్రదర్శించాలని సూచించింది. దీనితో పాటు బీడీ స్థానంలో పెన్సిల్ను పెట్టాలని సెన్సార్ బోర్డ్ ఆదేశించినట్లుగా మీడియా కథనాలు చెబుతున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











