సెన్సార్ బోర్డ్ కొత్త నిర్ణయం
న్యూఢిల్లీ: సున్నిత మతపరమైన అంశాలతో కూడిన సినిమాల విడుదలపై సంబంధిత మతపెద్దల అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం లేదని సెన్సార్బోర్డులకు కేంద్ర సమాచార ప్రసారశాఖ స్పష్టం చేసింది. సెన్సార్బోర్డులో సదరు మతానికి చెందిన సభ్యులెవరూ లేనప్పటికీ.. సినిమా విడుదలను నిర్ణయించాల్సింది బోర్డు సభ్యులేనని పేర్కొంది. సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ నిర్ణయం మేరకు మంత్రిత్వశాఖ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
'దోజాఖ్: ఇన్ సెర్చ్ ఆఫ్ హెవెన్' అనే సినిమాపై తలెత్తిన వివాదం నేపథ్యంలో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఒక ముస్లిం అబ్బాయి హిందూ పుణ్యక్షేత్రమైన వారణాసిలో పెరిగిన తీరే ఈ సినిమా కథాంశం. ఈ సినిమా ముస్లింల మనోభావాలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న కారణంతో కేంద్రసెన్సార్బోర్డు సభ్యులు.. ముస్లిం మతపెద్దలకు ఈ సినిమాను చూపించాలని అభిప్రాయపడ్డారు.

బోర్డులో ముస్లిం సభ్యులు ఎవరూ లేరు కాబట్టి.. మతపెద్దల ఎదుట సినిమాను ప్రదర్శించాలని వారు భావించారు. కానీ, సీబీఎఫ్సీ ఛైర్పర్సన్ లీలాశ్యాంసన్ ఈ వాదనను తోసిపుచ్చి సినిమా విడుదలకు అనుమతి ఇచ్చారు. లీలాశ్యాంసన్ నిర్ణయాన్ని మంత్రి జవదేకర్ సమర్థించారు. దేశవ్యాప్తంగా ఉన్న సెన్సార్బోర్డులన్నీ ఇదే విధంగా పని చేయాలని, సినిమా విడుదలను బోర్డే స్వయంగా నిర్ణయించాలని ఆదేశించారు.


Click it and Unblock the Notifications











