‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ ఆపాలంటూ ఫిర్యాదుపై... ఎలక్షన్ కమీషన్ ఫస్ట్ రియాక్షన్!
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్కు టీడీపీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఎన్నికల కమిషన్ను కలిసి ఈ నెల 22న విడుదల కాబోతున్న ఈ సినిమా విడుదల నిలిపివేయాలనికోరారు. సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను నెగెటివ్గా చూపించారని, సినిమా ఓటర్లపై ప్రభావం చూపుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలి విడత పోలింగ్ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుపై ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పందించారు.

ఎన్నికల అధికారి ఏమన్నారంటే...
తెలుగు దేశం పార్టీ వారు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంపై ఇచ్చిన ఫిర్యాదుపై ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ స్పందిస్తూ...‘ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు సినిమాలో ఉన్నాయా? ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందా? ఎన్నికల కోడ్ ఉల్లంఘించే కంటెంట్ ఏమైనా ఉందా? తదితర అంశాలను పరిశీలించిన తర్వాత అవసరం అయితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

టీడీపీ కార్యకర్తల ఆందోళన
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్ తమ పార్టీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసే విధంగా ఉందని తెలుగు దేశం పార్టీ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం తాను ఎవరినీ టార్గెట్ చేయడం లేదని, అలాంటి ఇంటెన్షన్ తనకు లేదని, జరిగిన వాస్తవాలు చూపిస్తున్నానంటూ తన వాదన వినిపిస్తున్నారు.

సినిమా ఆపే ప్రసక్తే లేదంటున్న వర్మ
ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా ఆపే ప్రసక్తే లేదని, ఒక వేళ ఎన్నికల కమీషన్ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తే న్యాయపోరాటానికైనా సిద్ధమని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేస్తున్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్
ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత జరిగిన పరిణామాలు ఈ చిత్రంలో ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











