పవన్ సినిమాలో ‘టి’ వ్యతిరేక సీన్లు తొలగింపు
హైదరాబాద్: పవర్ స్టార్ పవణ్ నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో తెలంగాణ ఉద్యమాన్ని, ఇక్కడి ప్రజల మనోభావాలను కించ పరిచే విధంగా సీన్లు, డైలాగులు ఉన్నాయని తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు మొదలైన నేపథ్యంలో....వాటిని తొలగించేందుకు దర్శక నిర్మాతలు శర వేగంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ చిత్రం నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మాట్లాడుతూ తొలగింపు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఉద్దేశ్య పూర్వకంగా ఆ సన్నివేశాలు పెట్ట లేదని, స్క్రిప్టులో భాగంగానే పలు సీన్లు, డైలాగులు పెట్టినట్లు తెలిపారు.
వివాదాల వివరాలు....
'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో తెలంగాణ ఉద్యమాన్ని కించ పరిచేలా పరోక్షంగా కొన్ని సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయని...దర్శకుడు పూరి జగన్నాథ్ కావాలనే సినిమాలో ఇలాంటివి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు క్యాంపస్ సమీపంలోని తార్నక 'ఆరాధన' థియేటర్పై విరుచుకుపడి బలవంతంగా రీళ్లు ఎత్తుకెళ్లారు. వాటిని తగులబెట్టి నిరసన తెలిపేందుకు తీసుకెలుతున్నట్లు విద్యార్థులు వెల్లడించారు.
సినిమాలో పరోక్షంగా తెలంగాణ ఉద్యమాన్ని కించపరచడం అంటే వందల మంది ప్రాణ త్యాగాలను అపహాస్యం చేసినట్లే అని విద్యార్థి నాయకులు మండి పడుతున్నారు. మరో వైపు వరంగల్ అమృత థియేటర్లో కూడా తెలంగాణ వాదులు ఈ చిత్రం పోస్టర్లు, ప్లెక్సీలు ధ్వంసం చేసారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఈచిత్రం ఉందని ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే ఆ సీన్లను తొలగించాలని, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే తెలంగాణలో సినిమాను ఆడనివ్వబోమని హెచ్చరించారు. తెలంగాణలోని పలు చోట్ల కూడా ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఆ సంగతి అలా ఉంచితే....తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు కూడా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంపై తమ ప్రతాపం చూపుతున్నారు. ఈచిత్రంలో విలన్ పాత్రను చంద్రబాబు ఉద్దేశిస్తూ చిత్రీకరించారని, కావాలనే పూరి ఇలాంటి చేసారని ప్లెక్సీలు, పోస్టర్లు ధ్వంసం చేసారు.
సినిమాపై ఇలా రాజకీయ, ప్రాంతీయ వివాదాలు చుట్టుముట్టడంతో నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. యావరేజ్ టాక్ తోడు...ఈ వివాదాలు సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని మదన పడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా రూపొందిన ఈచిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. యూనివర్శల్ మీడియా పతాకంపై డివివి దానయ్య ఈచిత్రాన్ని నిర్మించారు.
ప్రకాష్ రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.


Click it and Unblock the Notifications











