మీ వల్లే వచ్చా, బట్టలు చింపుకున్నా, ఆ మాట అనొద్దు: పవన్ కళ్యాణ్ గురించి నితిన్ ఎమోషనల్ స్పీచ్!
Recommended Video

నితిన్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా కృష్ణ చైతన్య దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రం 'ఛల్ మోహన్ రంగ'. శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగాహాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి హీరో నితిన్ ఎమోషనల్గా మాట్లాడారు.

'వీడు సినిమాలకు తప్ప దేనికీ పనికిరాడు' అని అనుకున్నారేమో
నితిన్ మాట్లాడుతూ.... "25 సినిమాలు.. 16 ఏళ్లు.. ఈ జర్నీ రోలర్ కోస్టర్ రైడ్. ఈ జర్నీలో నేను ముందుగా థాంక్స్ చెప్పుకోవాల్సింది కరుణాకరన్గారికి, పవన్ కళ్యాణ్గారికి. వారి కాంబినేషన్లో వచ్చిన 'తొలిప్రేమ' చూసిన తర్వాతే నేను హీరో కావాలని అనుకున్నాను. తర్వాత నేను థాంక్స్ చెప్పుకోవాల్సింది నా ఫస్ట్ డైరెక్టర్ తేజగారు. నాకు సినిమా ఛాన్స్ ఇచ్చి, నాకు యాక్టింగ్ రాకున్నా కూడా నేర్పించిన మొదటి గురువు. తర్వాత నేను థాంక్స్ చెప్పాల్సింది నా తల్లిదండ్రులకు. నేను సినిమాల్లోకి వెళ్తానంటే వద్దనకుండా నన్ను ఎంకరేజ్ చేశారు. అపుడు వారు 'వీడు సినిమాలకు తప్ప దేనికీ పనికిరాడు' అని అనుకున్నారేమో.... అని నితిన్ వ్యాఖ్యానించారు.

ఏరా పోరా అని చాలా సార్లు తిట్టుకున్నాం
ఇన్నాళ్లు నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు అందరికీ థాంక్స్. ఛల్ మోహన్ రంగ నా 25వ సినిమా. ఈ సినిమాలో పనిచేసిన మేఘా, లిజీ మేడమ్, రావురమేష్ గారు, మధు, నర్రా గారు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సినిమాకు బ్యాక్బోన్ కెమెరామేన్ నట్టిగారు. ఆయన మా వెన్నంటే ఉండి చాలా సాయం చేశారు. ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ గారు, మా ఎడిటర్ శేఖర్, వారితో పాటు సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు. దర్శకుడు కృష్ణచైతన్య నాకు చాలా ఏళ్లుగా మంచి తెలుసు. తను నా ఫ్రెండ్. ఆతడితో ఉన్న క్లోజ్నెస్ వల్లనే సినిమా కోసం ఏరా, పోరా అని చాలా తిట్టుకున్నాం. అన్నీ సినిమా కోసమే. ఈ సినిమా హిట్టయి చైతన్యకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. తమన్ చాలా మంచి సంగీతాన్నిచ్చారు. ఏ లవ్ స్టోరీ అయినా పాటలు బావుండాలి. తమన్ నా కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఇచ్చారు. పాటలు రాసిన కె.కె., బాలాజీ, సాహితీ, నీరజ కోన, కేదార్నాథ్కి ధన్యవాదాలు.... అని నితిన్ తెలిపారు.

నా ఇష్టమైన మొదటి ముగ్గురు వీరే
ఈ సినిమా నాకు ఎందుకు స్పెషల్ అంటే... ఇది 25వ సినిమా అని కాదు, ఈ సినిమాను నిర్మించింది పవన్ కళ్యాణ్గారు, అలాగే త్రివిక్రమ్గారు, మా నాన్నగారు. నా జీవితంలో నాకు ఇష్టమైన మొదటి ముగ్గురూ వీళ్లే... అని నితిన్ అన్నారు.

త్రివిక్రమ్ గారికి సైట్ కొడతానని చెప్పా
ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చాను, అక్కడ నాకు ఒక ప్రశ్న ఎదురైంది. ఒక వేళ నేను ఎవరికైనా అబ్బాయికి సైట్ కొట్టాలంటే ఎవరికి కొడతానంటే త్రివిక్రమ్గారికే అని చెప్పాను. ఆయనంటే అంత ప్రేమనాకు... అని నితిన్ తెలిపారు.

నాకు ఇండస్ట్రీలో పెద్ద స్ట్రెంత్ వారే
నేను ఎవరి సినిమాలు చూస్తూ పెరిగానో, ఎవరి సినిమాలు చూసి హీరో అయ్యానో, ఎవరి సినిమాలకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో బ్యానర్లు కట్టి, బట్టలు చింపుకుని, పేపర్లు ఎగరేసానో, ఎవరిని ఒక్కసారి చూస్తే చాలనుకున్నానో, ఒక్కసారి కలిస్తే చాలనుకున్నానో, ఒక్కసారి ఫోటో దిగితే చాలనుకున్నానో.... ఇవన్నీ చాలా బలంగా అనుకున్నాను, దేవుడి దయవల్ల అన్నీ జరిగాయి. ఈ రోజు నాకు ఇండస్ట్రీలో పెద్ద స్ట్రెంత్ ఎవరంటే... పవన్ కళ్యాణ్గారు ఉన్నారు, త్రివిక్రమ్గారు ఉన్నారు అని చెబుతాను. వారు నా సినిమాకు నిర్మాత కావడం అనేది నా అదృష్టం. అభిమానుల అందరి అదృష్టం.... అని నితిన్ తెలిపారు.

`సినిమాలు చేయను` అని అంటే ఫ్యాన్స్ తట్టుకోలేం
మా ఫ్యాన్స్ నుంచి కళ్యాణ్గారికి చిన్న రిక్వెస్ట్. పవన్ కళ్యాణ్గారు ఏ ఫీల్డ్ కి వెళ్లినా సక్సెస్ అవుతారు. ఆయన నోటి వెంట `సినిమాలు చేయను` అని అంటే ఫ్యాన్స్ తట్టుకోలేం. మీకు వీలైనపుడు ఒక సినిమా చేయండి, ఆ మాట మాత్రం అనొద్దు. ఎప్పుడో ఒక సినిమా చేయకపోతారా అనే హోప్తో ఉంటాం. ‘ఛల్ మోహన్ రంగ' ఏప్రిల్ 5న విడుదలవుతుంది. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. కళ్యాణ్గారి పేరును, త్రివిక్రమ్గారి పేరును నిలబెడుతుంది... అని నితిన్ తెలిపారు.


Click it and Unblock the Notifications











