చాలా సేపు అలాగే చూశాడు.. అప్పుడే దీన్ని ఊహించా: వైష్ణవ్ ఎలాంటి వాడో చెప్పిన చిరంజీవి
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకతే వేరు. స్వయంకృషితో సినిమాల్లోకి ప్రవేశించి, దాదాపు నలభై ఏళ్లుగా టాలీవుడ్లో చక్రం తిప్పుతున్న మెగాస్టార్ చిరంజీవే దీనికి కారణం అని చెప్పొచ్చు. అంతేకాదు, ఆయన తర్వాత ఈ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వీరిలో చాలా మంది టాప్ స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఇలాంటి సమయంలో వైష్ణవ్ తేజ్ రూపంలో 'ఉప్పెన' అనే మూవీ ద్వారా మరో హీరో పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి.. వైష్ణవ్ తేజ్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఆ విశేషాలు మీకోసం!
Recommended Video

చిన్న వయసులోనే పరిచయమైన వైష్ణవ్
మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొందరు చైల్డ్ ఆర్టిస్టులుగానూ నటించారు. అందులో పంజా వైష్ణవ్ తేజ్ కూడా ఒకడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'శంకర్ దాదా ఎంబీబీఎస్'లో అతడు కీలక పాత్రను పోషించాడు. చిన్న వయసులోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. దీంతో ఎప్పుడో హీరోగా ఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నా అది జరగలేదు.

ఉప్పెనతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఉప్పెన'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్గా నటించింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నెగెటివ్ పాత్రలో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కింది. ఇది ఫిబ్రవరి 12న విడుదల కాబోతుంది.

పాట.. ట్రైలర్తో అంచనాలు పెరిగిపోయాయి
'ఉప్పెన' సినిమాలోని 'నీ కన్ను నీలి సముద్రం' అనే పాట సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటతో సినిమా అందరి దృష్టిలో పడింది. అలాగే, ఆ మధ్య విడుదలైన టీజర్, ఇటీవల వచ్చిన ట్రైలర్లు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ముఖ్యంగా యూత్ను ఆకట్టుకున్నాయి. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా విపరీతంగా జరిగింది.

ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్... చిరు రాకతో
ఇక, 'ఉప్పెన' విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇందులో భాగంగానే శనివారం రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీనికి చిత్ర యూనిట్ సభ్యులతో పాటు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు దర్శకుడు హరీశ్ శంకర్, సుకుమార్, కొరటాల కూడా వచ్చారు.

వైష్ణవ్ తేజ్ ఎలాంటి వాడో చెప్పిన చిరంజీవి
ఈ ఈవెంట్లో చిరంజీవి సుదీర్ఘంగా మాట్లాడారు. తన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సినిమా అనే కాకుండా ప్రతి ఒక్కరి గురించి క్షుణ్ణంగా వివరించారు. ఇప్పటికే సినిమా చూశానని, దర్శకుడి పని తీరు, నటీనటుల ప్రదర్శన ఆకట్టుకున్నాయని అన్నారు. ఇది వంద కోట్ల రూపాయల సినిమా అని చెప్పారు. చివర్లో వైష్ణవ్ తేజ్ ఎలాంటి వాడో సవివరంగా వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి.

చాలా సేపు చూశాడు... అప్పుడే ఊహించా
వైష్ణవ్ టాలెంట్ గురించి చిరు మాట్లాడుతూ.. 'శంకర్ దాదా సినిమా సమయంలో ఓ పాత్రను వీడితో చేయాలని అనుకున్నా. అందుకోసం ఇంట్లో వీడిని కదలకుండా కూర్చుని అలాగే చూస్తుండరా అని చెప్పాను. ముందు ఫ్యాన్ తిరుగుతున్నా వాడు నేను చెప్పే వరకూ అలాగే చూస్తుండిపోయాడు. అప్పుడే వీడు పెద్ద స్టార్ అవుతాడని అనుకున్నా. సినిమాలో కుర్చీలో కూర్చుని ఉండే అబ్బాయి వీడే' అంటూ ఎమోషనల్గా మాట్లాడారు.


Click it and Unblock the Notifications











