చిరు రీ ఎంట్రీపై హాట్ న్యూస్
చిరంజీవి 150వ చిత్రం చేస్తానంటూ చాలా కాలంగా ఊరిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి ప్రవేసించిన చిరంజీవి తనకు సరైన కథ దొరికితే సినిమా చేస్తానంటూ దాటవేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు అదే పనిమీద చిరంజీవి,ఆయన టీమ్ కూర్చుంటున్నట్లు సమాచారం. పరుచూరి బ్రదర్శ్ ఆ మేరకు స్క్రిప్టు వంటకం రెడీ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే దర్శకుడు ఎవరనేది ఫైనల్ కాలేదని చెప్తున్నారు. వినాయిక్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. వినాయిక్ ప్రస్తుతం చిరు కుమారుడు రామ్ చరణ్ తేజ హీరో గా సినిమా రూపొందించటంలో బిజీగా ఉన్నారు.
ఇక పార్టీలోనూ, ప్రజల్లోనూ తగ్గుతున్న తన చరిష్మాను పెంచుకునేందుకు తన మెగా నటనను వెండితెరపై మరోసారి ప్రదర్శిస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయనుకున్న చిరంజీవి ఆ మేరకు పలుమార్లు తన పునరాగమానికి సంబంధించిన సంకేతాలు ఇచ్చారు. గత రెండేళ్ళుగా మెగా పునరాగమనంపై ప్రచారం జరుగుతున్నా అది కార్యరూపం దాల్చకపోవడంతో ఆయన అభిమానులు ఎప్పటికప్పుడు నిరుత్సాహానికి గురవుతున్నారు. చిరంజీవి కుమారుడు రామ్చరణ్ నిర్మాతగా సినిమా ప్రారంభమవుతుందని రెండేళ్ళ నుంచి ప్రచారం జరుగుతోంది. గత ఏడాది ఆగస్టులో చిరంజీవి జన్మదినం సందర్భంగా తన తండ్రి హీరోగా సినిమా నిర్మించబోతున్నానని ప్రకటించిన రామ్చరణ్ వచ్చే జన్మదినం నాటికి ఆ సినిమా విడుదలవుతుందని ఆయన స్పష్టం చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.
ప్రస్తుత పరిస్థితులలో తాను నటించే సినిమా ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమని భావిస్తోన్న చిరంజీవి ఆ మేరకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏడాదికి రెండు సినిమాలైన చేస్తే ప్రజల్లో అభిమానంతో పాటు పార్టీకి కూడా ఉపయోగకరంగా ఉంటుందన్న వాయిలార్ సూచనను చిరంజీవి పరిగణనలోకి తీసుకున్నారు. పార్టీకి లబ్ధి చేకూరడంతో పాటు సామాజిక సందేశాన్ని అందించే కథ లభిస్తే ఇప్పటికిప్పుడు నటించేందుకు సిద్ధమని ఆయన తిరుపతిలో ప్రకటించడానికి కారణమిదేనని చిరంజీవి అభిమానులు పేర్కొంటున్నారు. త్వరలో కార్యరూపం దాల్చనున్న చిరంజీవి పునరాగమ ప్రక్రియ వెనుక భారీ కసరత్తే జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లోనే కాక సినీ వర్గాల్లో సైతం చిరు ..రీ ఎంట్రీపైనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఠాగూర్,స్టాలిన్ వంటి సామాజిక సందేశం ఉన్న సబ్జెక్టులతో వచ్చే అవకాశముందని చెప్పుకుంటున్నారు. అలాగే చిరంజీవి సైతం కథ,దర్శకుడు ఖరారు అయ్యేవరకూ ఆ విషయం సీక్రెట్ గా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న తన చిత్రాన్ని ఎవరికి టార్గెట్ చేయాలి...తన అభిమానులను సంతృప్తిపరచే విధంగా సీన్స్ ఉంచాలా వద్దా అనే విషయాలపై తర్జనబర్జన పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. రచ్చకి పనిచేసి హిట్ కొట్టిన పరుచూరి బ్రదర్శ్ ... ఈ సినిమాతో మళ్లీ తమ కలం బలం ఏమిటో చూపాలని ఉవ్విళ్లూరుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అలాగే సినిమాలో రాజకీయ అంశాలను ఏ మేరకు స్పృశించాలనే విషయమై కూడా ఓ అవగాహనకు వస్తే బెస్ట్ అని వారు చిరంజీవికి సూచించినట్లు..చిరంజీవి సైతం.... తన వారితో మాట్లాడి ఫైనలైజ్ చేస్తానని చెప్పటం జరిగిందని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











