Ayodhya Ram Mandir: 500 ఏళ్ల కల నెరవేరుతోంది.. హనుమాన్ పిలిచాడు: చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
భారతదేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు కోసం ఎన్నో ఏళ్లుగా కోట్ల మంది కన్న కల నేటితో తీరనుంది. ఈరోజే (జనవరి 22వ తేదీ) అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరగనుంది.
దీనికోసం ఎంతో మంది సెలెబ్రిటీలు అక్కడకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో కలిసి అయోధ్యకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేశారు. అవేంటో మీరే చూసేయండి మరి!

దేశంలో గొప్ప కార్యక్రమం: అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దేశంలోనే గొప్ప కార్యక్రమంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయబోతున్నారు.
సినీ సెలెబ్రిటీలు కూడా: అయోధ్య రామ మందిరంలో జనవరి 22వ తేదీన జరగనున్న బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఇండియా వ్యాప్తంగా ఉన్న పలు రంగాలకు చెందిన ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ముఖ్యంగా ఫిల్మ్ సెలెబ్రిటీలను ఈ కార్యక్రమానికి పిలిచారు. వీరిలో కొందరికి ప్రభుత్వ పెద్దలు స్వయంగా ఆహ్వాన పత్రికలను అందించిన విషయం తెలిసిందే.

టాలీవుడ్లో.. మెగా రాక: అయోధ్య రామ మందిరంలో జరగనున్న బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులను కూడా ఆహ్వానించారు. అందులో చిరంజీవి, రామ్ చరణ్, మోహన్ బాబు, ప్రభాస్ సహా చాలా మందే స్టార్లు ఉన్నారు. వీరిలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు.
గర్వంగా ఉందన్న చిరు: ఇప్పటికే అయోధ్య చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ నేషనల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ మహోన్నత కార్యక్రమానికి హాజరు కావడం గర్వంగా ఉందని ఆయన వెల్లడించారు. '500 ఏళ్లకు పైగా యావత్ దేశం మొత్తం కన్న కల నెరవేరబోతుంది. ఈ కార్యక్రమానికి నేను నా ఫ్యామిలీతో కలిసి హాజరు కావడం సంతోషంగా, గర్వంగా ఉంది' అని చెప్పారు.
మోదీని అభినందిస్తూ: అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు. 'కొన్ని కోట్ల మంది కోరికను నిజం చేస్తున్న ప్రధాని మోదీ గారికి, ఆయన వెనుక ఉండి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్న వాళ్లకు నా అభినందనలు. ఆయన భారతీయుల కల నెరవేరడానికి కారణం అయ్యారు' అంటూ చెప్పుకొచ్చారు.

హనుమాన్ పిలిచాడు: ఆ తర్వాత చిరంజీవి కంటిన్యూ చేస్తూ... 'ఈ మహా కార్యాన్ని దగ్గరుండి చూసే అవకాశం చాలా తక్కువ మందికే వచ్చింది. అందులో మేము ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు హనుమంతుడు ఇష్టదైవం. ఆయనే నన్ను ఈ కార్యానికి ఆహ్వానించినట్లుగా ఉంది. ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని కార్యక్రమం అవుతుందని గర్వంగా చెప్తున్నా' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











