పురస్కారాల వేళ: చిరంజీవి, కృష్ణం రాజు, జగపతిబాబు తదితరుల స్పందన
2014, 2015, 2016 సంవత్సరాలకు నంది అవార్డులను, ఎన్టీఆర్ జాతీయ అవార్డును, బీఎన్రెడ్డి నేషనల్ అవార్డులను, రఘుపతి వెంకయ్య, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
Recommended Video

ఏపీ ప్రభుత్వం సోమవారం 2014, 15, 16కు గాను నంది అవార్డులను ప్రకటించింది. 2014, 2015, 2016 సంవత్సరాలకు నంది అవార్డులను, ఎన్టీఆర్ జాతీయ అవార్డును, బీఎన్రెడ్డి నేషనల్ అవార్డులను, రఘుపతి వెంకయ్య, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసిన జ్యూరీ కమిటీ సభ్యులు వివరాలను వెల్లడించారు. మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నంది అవార్డుల పండగ రానే వచ్చింది. మొత్తానికి అభిమానులంతా ఆనందం లో మునిగిపోయారు. ఈ సంధర్భంగా ప్రముఖులు తమ ఆనందాన్నీ, అభిప్రాయాన్నీ ఇలా వెల్లడించారు...

చిరంజీవి
"రఘుపతి వెంకయ్య అవార్డుకు కమిటీ నన్ను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓ గొప్ప వ్యక్తి పేరిట నెలకొల్పిన అవార్డు 2016 ఏడాదికి గాను నన్ను ఎంపిక చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి.. జ్యూరికి నా కృతజ్ఞతలు. అలాగే మిగతా విజేతలకు నా అభినందనలు"

జగపతిబాబు
ఏం చెప్పాలో తెలియడంలేదు. హీరోగా నా ఫస్ట్ మూవీ అట్టర్ ఫ్లాప్. విలన్గా ఫస్ట్ మూవీకి నంది అవార్డు వచ్చింది. మా ఇంటికొచ్చిన ఎనిమిదో నంది ఇది. విలన్గా నంది వచ్చింది కాబట్టి, అలానే కంటిన్యూ అవుతాననుకుంటున్నారేమో. అన్ని రకాల పాత్రలూ చేస్తానండోయ్.

నటుడు శర్వానంద్
ఈ మూడేళ్లల్లో నేను చేసిన సినిమాల్లో రెండు సినిమాలు మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్గా అవార్డు దక్కించుకోవడం ఆనందంగా ఉంది. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', ‘శతమానం భవతి' రెండూ మంచి చిత్రాలు. నాలుగో నంది అందుకోబోతున్నా. ‘మళ్ళీ మళ్ళీ..'లో ఇంపార్టెంట్ సీన్స్ని వైజాగ్ బీచ్ దగ్గర తీయడం ఓ మంచి మెమరీ. ‘శతమానం భవతి' రాజమండ్రి షెడ్యూల్ ఓ స్వీట్ మెమరీ. ఆ సమయంలో నేను ‘అయ్యప్ప మాల'లో ఉన్నాను.

కృష్ణంరాజు
2014వ సంవత్సరానికిగాను రఘుపతి వెంకయ్య అవార్డుకు నన్ను ఎంపిక చేశారు. అంత గొప్ప అవార్డు రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. రఘుపతి వెంకయ్య పేరు మీద అవార్డు నెలకొల్పడమే చాలా గొప్ప విషయం. ఆ అవార్డు నన్ను వరించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. అంతే కాకుండా 2015వ సంవత్సరానికి ప్రకటించిన అవార్డుల్లో ‘బాహుబలి' తన సత్తా ఏంటో నిరూపించుకున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది.

కొరటాల శివ
"నా ముడు సినిమాల్లోని మేల్ లీడ్ యాక్టర్లు ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ నంది అవార్డు గెలుచుకోవడం చాలా సంతోషంగానూ.. గర్వంగానూ ఉంది. దీన్ని ఎప్పటికీ కాపాడుకుంటాం" అని శివ ట్వీట్ చేశారు. మరో ట్వీట్ ద్వారా నంది అవార్డు గ్రహీతలు అందరికీ అభినందనలు తెలిపారు. బెస్ట్ యాక్టర్ అవార్డ్ గెలుచుకున్నందుకు మహేశ్, తారక్కి, అలాగే రచయిత రామజోగయ్య శాస్త్రికి అభినందనలు తెలిపారు. తన సినిమాలైన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్లను అప్రిసియేట్ చేసినందుకు కమిటీకి థ్యాంక్స్ చెప్పారు.

దర్శకుడు బోయపాటి శ్రీను
దక్షిణ భారతదేశంలో మూడు కేలండర్లు చూసిన ఏకైక చిత్రం "లెజెండ్". బాలకృష్ణగారి కెరీర్లోనే ఇదొక మైలురాయి. ‘లెజెండ్'కు వచ్చిన మొత్తం తొమ్మిది అవార్డులు సినిమాకి దక్కిన గౌరవంగా భావిస్తున్నా. నా కెరీర్లోనే మొదటిసారి అందుకుంటున్న నంది ఇది. ఈ అవార్డును గుండెల్లో దాచుకుంటా. నాకు మాత్రమే కాకుండా ఉత్తమ హీరోగా అవార్డు అందుకోనున్న బాలకృష్ణగారికి, ఉత్తమ విలన్గా సెలక్ట్ అయిన జగపతిబాబుగారికి, మా సినిమాకి, మాతో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

నిర్మాత రాజ్ కందుకూరి
మా చిత్రంలో పెద్ద స్టార్లు లేరు, భారీ బడ్జెట్టూ లేదు. కథపై నమ్మకంతో ‘పెళ్ళిచూపులు' తీశాం. మంచి కథ, కథనంతో రూపొందిన చిత్రాల్ని ఆదరించే ప్రేక్షకులకు నా థ్యాంక్స్. ప్రేక్షకాదరణ, వాళ్ల మద్దతు లేకుండా మేం ఏమీ చేయలేం. ఎప్పుడైనా అంతిమ తీర్పు ప్రేక్షకులదే. వాళ్లు వంద రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా చూడకపోతే... మేము ఎన్ని సినిమాలు తీసినా ప్రయోజనం ఏముంటుంది? అందువల్ల, భవిష్యత్తులోనూ కథను నమ్మే సినిమాలు తీస్తా.. ప్రామిస్.

మంచు లక్ష్మీప్రసన్న
నాకు నచ్చింది నేను చేస్తున్నాను. ప్రతి స్త్రీ తను అనుకుంటున్నట్లుగా తను జీవించాలి. నేనలానే జీవిస్తాను. నా డ్రీమ్స్ని నెరవేర్చుకోవడానికి కృషి చేస్తా. ప్రతి అవార్డు ఇంకొంచెం ఎక్కువ పని చేయడానికి ఉత్సాహాన్నిస్తుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డు వచ్చినప్పుడు చేసిన కష్టం మరచిపోతాం. ‘చందమామ కథలు'లో లీసా స్మిత్ క్యారెక్టర్ గురించి దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెప్పి, ఈ పాత్ర మీరు చేయకపోతే సినిమా చేయనన్నారు. ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు అవార్డు కూడా దక్కినందుకు ఆనందంగా ఉంది.

కమల్హాసన్
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఎన్టీఆర్ జాతీయ అవార్డు (2016) సూపర్స్టార్ రజనీకాంత్కు వచ్చింది. ఆయనకు శుభాకాంక్షలు. ఇదే అవార్డుతో నన్ను కూడా (2014) గౌరవించినందుకు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి మీరు (తెలుగు) అందిస్తున్న సపోర్ట్కు రుణపడి ఉంటాను. చాలా
సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు.

దర్శకుడు చందూ మొండేటి
నంది వస్తుందని అసలు ఊహించలేదు. వెరీ హ్యాపీ! అవార్డులు మన బాధ్యతను పెంచుతాయి. కుటుంబ సభ్యులు, మా ‘కార్తికేయ' టీమ్, ఇండస్ట్రీలో స్నేహితులు సంతోషంతో ఫోన్లు చేస్తుంటే... మనకు నంది అవార్డు వచ్చిందనే దానికన్నా ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంది. సమష్టి కృషి ఫలితమే ‘కార్తికేయ'. ఈ సందర్భంగా మా టీమ్ అందరికీ థ్యాంక్స్. వాళ్లకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను.


Click it and Unblock the Notifications











