సీఎం గారు, సైరా చూడండి.. వైఎస్ జగన్తో చిరంజీవి దంపతుల భేటి.. వైఎస్ భారతీ సాదర ఆహ్వానం
Recommended Video
మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. సతీసమేతంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి వెళ్లిన చిరంజీవి కొద్ది సేపటి క్రితం ఆయన్ను కలిశారు. తాడేపల్లిలో సీఎం నివాసానికి చేరుకున్న చిరంజీవి దంపతులను జగన్ దంపతులు సాదరంగా స్వాగతించారు.

కండువా కప్పి సన్మానం
అనంతరం చిరంజీవి, సీఎం వైఎస్ జగన్కి కండువా కప్పి సన్మానించారు. చిరంజీవి భార్య సురేఖ, జగన్ సతీమణి భారతికి చీర బహుకరించింది. తన తాజా సినిమా సైరా నరసింహా రెడ్డి చూడమని చిరంజీవిసీఎం జగన్ని కోరారు. దీనిపై జగన్ సానుకూలంగా స్పందించారని తెలిసింది. వీరిద్దరి కలయికకు సంబంధించిన పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

జగన్ - చిరంజీవి భేటీ.. ఆసక్తికర చర్చ
ప్రస్తుతం జరుగుతున్న జగన్ - చిరంజీవి భేటీలో పలు ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు ఏపీలో జోరుగా చర్చజరుగుతోంది. ఉన్నట్టుండి చిరంజీవి ఇలా జగన్ని కలవడం సినీ, రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ముందుగా ఈ భేటీ అక్టోబర్ 11 నే జరుగుతుందని భావించారు కానీ వాయిదా పడి నేడు జగన్ - చిరంజీవి భేటీ జరిగింది.

ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక..
ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి జగన్ని మర్యాద పూర్వకంగా కలిశారు చిరంజీవి. ఈ భేటీలో ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి, సైరా సినిమాకు పన్ను మినహాయింపు లాంటి అంశాలు ప్రస్తావనకు రావచ్చని టాక్ నడించింది. కొద్ది సేపట్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.

గతంలో గవర్నర్.. ఇప్పుడు సీఎం
తన కెరీర్లో వచ్చిన మొట్టమొదటి చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి చూడాలని కొద్ది రోజుల క్రితమే తెలంగాణా గవర్నర్ తమిళ సై ని చిరంజీవి కలిసిన సంగతి తెలిసిందే. వెంటనే ఈ సినిమా చూసిన ఆమె చిరుని ప్రశంసల్లో ముంచెత్తింది. ఈ క్రమంలో ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైరా చూశాక ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికర అంశంగా మారింది.


Click it and Unblock the Notifications











