ప్రత్యేక హోదా సాధించండి.. ప్రాజెక్టులు కట్టండి.. సినిమాలపై మీ ప్రతాపమా? చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. థియేటర్లలో ఈ చిత్రం 200 రోజులు ప్రదర్శించిన నేపథ్యంలో విజయోత్సవ వేడుకను ఆడంబరంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిరంజీవి, రవితేజ, మైత్రీ నవీన్, రవిశంకర్, దర్శకులు హరీష్ శంకర్, మలినేని గోపిచంద్, బుచ్చిబాబు సన తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్కు షీల్డుల బహుకరించారు. ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ...
ఆ రోజుల్లో మేము అని చెప్పుకొంటే.. ఈ రోజుల్లో మనకు ఏమిలేనట్టే. ఒకప్పడు సినిమాలు 100 రోజులు, 200 వందల రోజులు, సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీ ఆడేవి. ఆ రోజులు పోయాయి. కానీ ఇప్పుడు రెండు వారాల్లోనే సినిమా జర్నీ ముగుస్తున్నది. అలాంటి రోజుల్లో వాల్తేరు వీరయ్య చిత్రం 200 రోజులు ఆడటం మామూలు విషయం కాదు. గతంలో మాదిరిగా షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవడమనేది ఆనందాన్ని ఇస్తున్నది.

తెలుగు సినిమా పరిశ్రమలో మళ్లీ 200 రోజులు సినిమా ఆడే రోజులు వస్తాయా? పాత రోజులు రిపీట్ అవుతాయా? అనే అనుమానాలు, సందేహాలు ఉండేవి. కానీ మీలాంటి వాళ్లు అందరూ కలిసి, కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధ్యమే అని నిరూపించారు. వాల్తేరు వీరయ్య సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవిశంకర్, చెర్రీకి నా ధన్యవాదాలు అని చిరంజీవి అన్నారు.
వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల ఫంక్షన్లో ఏపీ ప్రభుత్వానికి ప్రత్యక్షంగా చురకలు అంటించారు. ప్రభుత్వం, ప్రభుత్వ అధినేతలు, అధికారులు పెద్ద పెద్ద విషయాలపై దృష్టిపెట్టాలి. మంచి ఫలితాలు రప్పించేలా పనిచేయాలి. ప్రత్యేక హోదా, లేకపోతే నీటి ప్రాజెక్టుల గురించి కానీ, లేదా రోడ్ల నిర్మాణాల గురించి కానీ, లేదా పేదవాళ్ల కడుపు నింపే పథకాలపై దృష్టిపెట్టాలి చిరంజీవి అన్నారు.

ఇంకా నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడం గానీ చేయాలి ఉపాధి అవకాశాలు గానీ, ఇతర అభివృద్ధి అంశాలపై దృష్టిపెడితే ప్రజలు, ప్రపంచం హర్షిస్తుంది. అలా కాకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరిగా సినిమా ఇండస్ట్రీపై పడితే ఎలా. దయచేసి ఇలాంటి చర్యలు మానుకోవాలి అని చిరంజీవి తన ప్రసంగంలో ఘాటుగా స్పందించారు. ఇటీవల రిలీజైన పవన్ కల్యాణ్ నటించిన బ్రో మూవీ, ఆగస్టు 11న తాను నటించిన భోళా శంకర్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిరంజీవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇదిలా ఉండగా, తమిళంలో భారీ విజయం అందుకొన్న అజిత్ నటించిన వేదాళం సినిమా ఆధారంగా భోళా శంకర్ చిత్రం రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాలో కీర్తి సురేష్, తమన్నా భాటియా, సుశాంత్ తదితరులు నటించారు. ఈ చిత్రం ఆగస్టు 11న రిలీజ్ అవుతున్నది. ఇప్పటికే ఈ చిత్రం భారీ కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదు చేస్తున్నది.
రవితేజ గురించి చిరంజీవి మాట్లాడుతూ... మనసులో ఏముంటుందో అదే మాట్లాడుతాడు. రవితేజతో నాకు మంచి అనుబంధం ఉంది. నా ఆజ్ కా గూండారాజ్ సినిమాకు అసిస్టెంట్గా పనిచేశాడు. అప్పుడే నా సినిమాలో తమ్ముడిగా క్యారెక్టర్ చేశాడు. ఈ సినిమా ఒప్పుకోకపోతే ఈ రేంజ్ ఉండేది కాదు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి.. మాస్ మహారాజా అయ్యాడు. వరుసగా సినిమాలు చేస్తూ బీజీగా ఉన్నాడు. రవితేజ మాదిరిగానే నేను వరుస సినిమాలు చేస్తూ పోటీ ఇస్తున్నాను అని చిరంజీవి అన్నారు.


Click it and Unblock the Notifications











