YS Jagan తో సినీ ప్రముఖుల భేటి.. చిరు, ప్రభాస్, మహేష్, రాజమౌళికి ఘన స్వాగతం.. అనూహ్యంగా ఆలీ పేరు!
ఏపీ ప్రభుత్వానికి, తెలుగు సినిమా పరిశ్రమకు మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికేలా చర్చలు జరుగనున్నాయి. గత కొద్ది నెలలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై సినీ వర్గాలు విమర్శలు గుప్పించడం, ఆ తర్వాత అనేక వివాదాస్పద సంఘటనలు చోటుచేసుకోవడం గందరగోళంగా మారింది. అయితే సంక్రాంతి రేసులో నిలిచిన చిత్రాలు కూడా టికెట్ల రేట్ల వివాదం కారణంగా రిలీజ్ వాయిదా పడటం సినీ పరిశ్రమకు ప్రతికూలంగా మారాయి. అయితే ఇలాంటి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ఇరు వర్గాలు ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. వైఎస్ జగన్తో భేటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
Recommended Video

ప్రత్యేక విమానంలో చిరు, ప్రభాస్, మహేష్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఫిబ్రవరి 10 తేదీ (గురువారం) సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల భేటికి రంగం సిద్ధమైంది. ఈ భేటికి మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు.

టాలీవుడ్ ప్రముఖులకు ఘన స్వాగతం
ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు వెళ్లిన సినీ ప్రముఖుల బృందానికి గన్నవరం ఎయిర్పోర్టులో అధికారులు, అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ప్రత్యేక విమానంలో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మహేష్ బాబుకు చిరంజీవి ఫ్లవర్ బోకే ఇస్తున్న ఫోటో ట్విట్టర్ ఇతర సామాజిక మాథ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది.

ప్రభాస్, మహేష్ ప్రత్యేక ఆకర్షణగా
అయితే ప్రభుత్వాలతో అధికారిక చర్చలు జరపడం, లేదా వ్యక్తిగత భేటీలకు దూరంగా ఉండే మహేష్ బాబు, ప్రభాస్ తాజా సమావేశానికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు ప్రముఖ హీరోలు కూడా ఈ సమావేశంలో పాల్గొనాలని నిర్ణయించుకోవడంతో సీఎం జగన్తో భేటి ఆసక్తికరంగా మారింది. పబ్లిక్ లైఫ్కు దూరంగా ఉండే హీరోలు కూడా సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించే భేటీకి హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.

కమెడియన్ ఆలీ పేరు తెరపైకి
ఇక సీఎం జగన్తో భేటికి ప్రముఖ కమెడియన్, వైసీపీలో చురుకైన కార్యకర్త ఆలీ పేరు కూడా తెరపైకి రావడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆలీని సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని ప్రత్యేకంగా ఆహ్వానించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆలీని ఈ భేటికి పిలువడంపై సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. గత రాత్రే ఆలీ రోడ్డు మార్గాన విజయవాడకు చేరుకొన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఆలీ పేరు అనూహ్యంగా తెరపైకి రావడంపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

సీఎం జగన్తో చర్చించే ప్రధాన అంశాలు ఇవే..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానితో తెలుగు సినిమా ప్రముఖులు జరిపే సమావేశంలో పలు విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా సినిమా టికెట్ల ధర పెంపు, సినీ పరిశ్రమకు రాయితీలు, సినిమా థియేటర్లలో వసతులు, సదుపాయాల కల్పన, ఇతర అంశాలపై సమాలోచనలు జరిపే అవకాశం ఉంది. టికెట్ల ధర పెంపుపై అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక గురించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











