ఎన్టీఆర్కు భారతరత్న చిరంజీవి డిమాండ్.. తారక రాముడు ఓ శక్తి.. బాలకృష్ణ
తెలుగువారి ఆరాధ్య దైవం, తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు , మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి నేడు. సినీనటుడిగా, రాజకీయవేత్తగా, ముఖ్యమంత్రిగా ఆయన తెలుగువారిపై ముద్ర అనన్య సామాన్యం. తెలుగువారికి ప్రపంచ స్థాయిలో గుర్తింపును, గౌరవాన్ని తీసుకొచ్చారు ఎన్టీఆర్. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా తెలుగు ప్రజలు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి అన్నగారికి నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. " కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను " అంటూ ఆయన పేర్కొన్నారు.

ఎన్టీఆర్ కుమారుడు, అగ్ర కథానాయకుడు బాలకృష్ణ సైతం తన తండ్రికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే ఒక శక్తి అని, నటనకు విశ్వవిద్యాలయమన్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆయన చదువుకే తొలి ప్రాధాన్యం ఇచ్చారని.. చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి మకుటం లేని మహారాజుగా వెలుగొందారని బాలయ్య తెలిపారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చారని.. రాజ్యాధికారానికి దూరంగా ఉన్న బడుగు, బలహీన వర్గాలకు పదవులు కట్టబెట్టారని చెప్పారు. ఎన్నో సంస్కరణలు , అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని.. వాటినే ఇప్పుడు అన్ని పార్టీలు అవలంభిస్తున్నాయని బాలకృష్ణ పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ను చిరు మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడే కాదు.. గతంలో ఎన్నోసార్లు రామారావుకు దేశ అత్యున్నత పురస్కారం ఇప్పించేలా తెలుగు ప్రభుత్వాలు కృషి చేయాలని మెగాస్టార్ కోరారు. రామారావు సమకాలీనుడైన ఎంజీఆర్కి ఇచ్చినప్పుడు ఎన్టీఆర్కు కూడా ఆ గౌరవం దక్కడం సముచితం, ఆనందదాయకమని చిరు అన్నారు.
ఎన్టీఆర్ మరణించి ఏళ్లు గడుస్తున్నా ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న అభిమానుల కల మాత్రం తీరడం లేదు. కేంద్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలంటూ సిఫారసులు వెళ్తూనే ఉన్నాయి. కానీ ప్రయోజనం మాత్రం శూన్యం. పెద్దాయన జయంతి, వర్ధంతి వంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, నాయకులు, ప్రముఖులు వేదికలపై ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. కానీ ఆ తరువాత విషయం మరుగున పడిపోయేది.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తూ ఆమోదముద్ర వేస్తారని ప్రచారం జరిగింది. తీరా భేటీ ముగిశాక ఎన్టీఆర్ అభిమానులు ఉసూరుమనిపించేలా ప్రకటన వెలువడింది. ఐదుగురు ప్రముఖులకు ఈ ఏడాది భారతరత్న పురస్కారాలను ప్రకటిస్తున్నట్లు కేంద్రం నిర్ణయించింది. దివంగత మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీలకు దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించారు. అయితే టీడీపీ ఈసారి ఎన్టీయే కూటమిలో భాగస్వామి కావడంతో రామారావుకు ఈసారైనా భారతరత్న పురస్కారం వస్తుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











