నాకే అవార్డు రాలేదన్న చిరంజీవి, బాలయ్యతో ఆప్యాయంగా... తన అవార్డు పంచిన మోహన్ బాబు (ఫోటోస్)
టి.ఎస్.ఆర్ టీవీ 9నేషనల్ అవార్డుల (2017 - 2018) వేడుక ఆదివారం సాయంత్రం విశాఖపట్నంలో వైభవంగా జరిగింది. సినీతారలంతా ఒకే వేధికపై కనిపించడంతో అభిమానులు పులకించి పోయారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరంగా ప్రసంగించారు.
వేదిక మీదున్న ముఖ్య అతిథుల్లో ఒకరు.. మంత్రి గంటా శ్రీనివాసరావుగారికి, నా సోదరుడు బాలకృష్ణ గారికి, నా మనసుకు అతి దగ్గరైనటువంటి నాగార్జున గారికి, పెద్దాయన మోహన్ బాబు గారికి (వెంటనే మోహన్ బాబు వచ్చి నన్ను పెద్దాయన అంటారేంటి? అనగానే చిరంజీవి వెంటనే మాట మార్చి కుర్రాయన మోహన్ బాబు గారికి) అంటూ తనదైన శైలిలో చమత్కార పూరితంగా ప్రసంగం ప్రారంభించారు.

ఇక్కడకు రావడం అంటే ఇష్టం
వైజాగ్కు వచ్చే అవకాశం వస్తే నేను అస్సలు వదులుకోను. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం. అందమైన తీరప్రాంతం. అన్నింటికి మించి అందమైన మంచి మనసున్న మనుష్యులు. వారిని కలిసే అవకాశం వదులుకోను. అలాంటి అవకాశం వస్తే సద్వినియోగం పరుచుకుంటాను. తద్వారా ఇంటికి ఆనందాన్ని గుండెల నిండా తీసుకెళతాను. ఈ రోజున వైజాగ్లో అలాంటి అనుభూతి ఇస్తున్న మీ అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చిరంజీవి తెలిపారు.

సుబ్బిరామిరెడ్డి గురించి...
ఇంత గొప్పగా ఎన్నో సంవత్సరాలుగా సుబ్బిరామిరెడ్డిగారు ఈ వేడుక చేస్తున్నారు. మీకు ఇంత శక్తి ఎలా వస్తుంది అంటే ఆయన ఒకటే అన్నారు. కళాకారులు, కళలు అంటే నాకు చాలా ఇష్టం. వారు రావాలి, ఆనందింపచేయాలి, ప్రోత్సహించాలి, తద్వారా వారు పొందే ఆనందం నుంచి నేను శక్తి పుంజుకుంటాను అని ఆయన చెప్పడం ఆయన కళాత్మక హృదయానికి నిదర్శనం.

నేను, బాలయ్య అంతా కలిసి వచ్చాం.. మొక్కుబడిగా కాదు
అందుకే ఆయన పిలవగానే నేను, బాలకృష్ణగారు, నాగార్జునగారు, ఇతర హీరోయిన్లు అందరూ వచ్చామంటే ఏదో మొక్కుబడిగా వచ్చింది కాదు. మనస్పూర్తిగా ఇష్టంతో వచ్చాము. ఏ ఫంక్షన్కు మేము అంతా కలిసి రావడం జరుగదు. అలాంటి ప్రయత్నం ఎవరూ చేయరు. అది సుబ్బిరామిరెడ్డిగారి వల్లే అవుతుంది.

అభిమానుల్లో కూడా..
మా అందరినీ ఒకే వేదికపైకి చేర్చి.. మా హీరోల మధ్య ఒక అన్నదమ్ముల అనుబంధం అన్నట్లుగా చూపించి... మా అభిమానులందరూ కలిసి కట్టుగా ఉండేలా సుబ్బిరామిరెడ్డిగారు దోహదం చేస్తున్నారని చిరంజీవి వ్యాఖ్యానించారు.

నాకే ఏ అవార్డూ రాలేదు
ఈ రోజున బాలకృష్ణకు అవార్డ్ వచ్చింది, నాగార్జునకు అవార్డ్ వచ్చింది, మోహన్ బాబుకు అవార్డ్ వచ్చింది... నాకే ఏ అవార్డూ రాలేదు. ఈ రోజు నేను తీసుకున్న అవార్డ్ రామ్ చరణ్కు వచ్చిన అవార్డ్. ఒకటి నిర్మాతగా, మరొకటి హీరోగా.. చరణ్ ఇక్కడ లేడు కాబట్టి దాన్ని నేను అందుకుంటున్నట్లు చిరంజీవి తెలిపారు.

పుత్రోత్సాహాన్ని ఆస్వాదిస్తున్నాను
ఇదే విశాఖపట్నంలో రంగస్థలం ప్రీ రిలీజ్ వేడుకలో ఒక మాట అన్నాను. చరణ్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత తండ్రిగా గర్విస్తున్నాను, నటుడిగా ఈర్ష్య పడుతున్నాను అన్నది నిజం. అలాంటి ఉత్తమ నటనతో టీవీ9 టీఎస్ఆర్ బెస్ట్ యాక్టర్ అవార్డ్కు ఎంపిక కావడం, అది నేను తీసుకునే అవకాశం రావడంతో పుత్రోత్సాహాన్ని మనసు నిండా ఆస్వాదిస్తున్నాను.

నాకు అలాంటి ఛాన్స్ ఇచ్చాడు
నిర్మాతగా ఖైదీ నెం. 150 తీశాడు. మగధీర సినిమా తర్వాత నేను ఒకటే అన్నాను. రాజమౌళి వల్ల చక్కని సినిమా చేసే అవకాశం నీకు లభించింది. కానీ నాకు ఇప్పటి వరకు ఇలాంటి కాస్టూమ్ డ్రామా అవకాశం రాలేదు అన్నాను. అది మనసులో పెట్టుకుని నిర్మాతగా తన రెండో సినిమా ‘సైరా నరసింహారెడ్డి' ద్వారా నాకు అలాంటి అవకాశం ఇచ్చాడు. చరణ్ ఇపుడు సభలో లేడు. ఎక్కడ ఉన్నా మీ ఆశీర్వాదం ఉంటుంది. ఈ సందర్భంగా రామ్ చరణ్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చిరంజీవి తెలిపారు.

చిరంజీవితో అవార్డు పంచుకున్న మోహన్ బాబు
చిరంజీవి ప్రసంగం ముగియగానే మోహన్ బాబు ఆయన వద్దకు వచ్చి.. ‘కొడుకు విజయమే తండ్రి విజయం. నీకు అవార్డు లేదన్నావు. నా అవార్డు నీకు, నీ అబ్బాయికి ఇస్తున్నాను.' అంటూ వ్యాఖ్యానించారు. దీనికి చిరంజీవి రియాక్ట్ అవుతూ.. ‘అలా కాదు.. మనమిద్దరం దాన్ని పంచుకుందాం' అని చెప్పడంతో సభ కేరింతలతో మారుమ్రోగిపోయింది.


Click it and Unblock the Notifications











