Sita Ramam, Bimbisaraపై చిరంజీవి ట్వీట్ వైరల్.. మరోసారి నిరూపించారు అంటూ!
గతంతో పోలిస్తే 2022లో తెలుగు సినీ ఇండస్ట్రీకి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. కరోనా లాక్డౌన్ ప్రభావం ఉన్న గత రెండేళ్లలోనూ మన దగ్గర ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. కానీ, ఈ ఏడాది మాత్రం టాలీవుడ్లో పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కాగా.. కేవలం నాలుగైదు చిత్రాలు మాత్రమే విజయాలను అందుకున్నాయి. అందులోనూ రెండు నెలలుగా తెలుగు సినిమాలను ప్రేక్షకులు అంతగా ఆదరించడం లేదు. ఈ వ్యవధిలో వచ్చిన బడా హీరోల సినిమాలు సైతం బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. దీంతో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా రాలేదు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు సినీ పరిశ్రమ వెళవెళబోయింది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస పరాజయాలు వస్తోన్న సమయంలో గత శుక్రవారం (ఆగస్టు 5) ఏకంగా రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అవే.. నందమూరి కల్యాణ్ రామ్ నటించిన టైమ్ ట్రావెల్ మూవీ 'బింబిసార'.. దుల్కర్ సల్మాన్ హీరోగా ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీతో రూపొందిన 'సీతా రామం'. విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ రెండు సినిమాలు.. ఎంతో గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందుకు అనుగుణంగానే ఇవి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ను, రివ్యూలను సొంతం చేసుకున్నాయి. దీంతో చిత్ర యూనిట్లు ఫుల్ ఖుషీగా ఉన్నాయి.

ఒకేరోజు విడుదలైన రెండు భారీ సినిమాలు 'బింబిసార', 'సీతా రామం' సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో ఆయా చిత్రాల యూనిట్లు, అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రముఖులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా విజయాలు లేక ఇబ్బందులు పడుతోన్న టాలీవుడ్కు.. ఒకేసారి రెండు భారీ హిట్లు రావడంతో ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ రెండు సినిమాల ఫలితాలపై స్పందించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఈ చిత్రాల యూనిట్లను అభినందించడంతో పాటు సినీ పరిశ్రమకు ఊరట లభించిందని చెబుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్లో 'ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని బాధ పడుతోన్న సినీ ఇండస్ట్రీకి ఎంతో ఊరటనీ, ఉత్సాహాన్ని ఇస్తూ.. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ.. నిన్న విడుదలైన రెండు చిత్రాలూ విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా 'సీతా రామం', 'బింబిసార' చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ పోస్ట్ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్కు అన్ని వర్గాల వాళ్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా నందమూరి అభిమానులు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

ఇదిలా ఉండగా.. సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రమే 'బింబిసారా'. మల్లిడి వశిష్ట అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్పై హరికృష్ణ నిర్మించాడు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలు చేశారు. అలాగే, దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ హీరోయిన్గా నటించింది. రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు చేశారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్లో సీ అశ్వనీదత్ నిర్మించారు.


Click it and Unblock the Notifications











