ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ.. అభిమాన సంద్రంలో సైరా అరుపులు.. మెగాస్టార్ క్రేజ్ అంటే అది
సైరా చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి వీర విహారం చేస్తోన్నసంగతి తెలిసిందే. అయితే వెండితెరపై సైరాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ ఊపు ఊపుతుంటే.. నిజంగా సైరా నరసింహుడు ఓ ఊరికి వెళ్తే ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించండి. ప్రస్తుతం తాడేపల్లి గూడెంలో మెగాసంద్రం ఏర్పడినట్లు కనిపిస్తోంది.
ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వెళ్లిన చిరు గన్నవరం ఎయిర్ పోర్టులో దిగారు. అయితే ఈ విషయం ముందే తెలుసుకున్న మెగాభిమానులు అక్కడికి చేరుకున్నారు. సైరా నరసింహా రెడ్డి, జై చిరంజీవ, అన్నయ్య అనే అరుపులతో ఆ ప్రాంతమంతా.. సందడిగా మారింది.
భారీ ర్యాలీ.. బందోబస్తు
అక్కడి నుంచి దాదాపు 250 కార్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ.. అక్కడక్కడా రోడ్ షో నిర్వహించుకుంటూ వెళ్లారు. అనంతరం తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్ కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన 9అడుగుల 3అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని చిరు ఆవిష్కరించారు. 120 మంది పోలీసు సిబ్బందితో చిరుకు పోలీసు బలగాలు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇది నా అదృష్టం..
అక్కడే ఏర్పాటు చేసిన సభలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘గత సంవత్సరం నుంచి ఎస్వీ రంగారావు విగ్రహం ఆవిష్కరించాలని నన్ను కోరారు. అప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు. ఇన్నాళ్లకు నేను అభిమానించే ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం నా అదృష్టం. నా తండ్రి గారికి రంగారావు జగత్ కిలాడీలు, జగత్ జంత్రీలు యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. అలవోకగా మాట్లాడటమే ఆయన ప్రత్యేకత'అని అన్నారు.

ఆయనే నాకు స్ఫూర్తి..
అనంతరం మాట్లాడుతూ.. ‘ఆయనను చూసే నాకు నటన పట్ల మక్కువ కలిగింది. నేను సినిమాల్లోకి రావడానికి ఆయనే స్ఫూర్తి. అటువంటి మహా నటుడు తెలుగువాడుగా పుట్టడం మన అదృష్టం. ఆయన నటనకు హద్దులు లేవు ఆయన అంతర్జాతీయ నటుడు. అలాంటి మహానుభావుడు విగ్రహం ఇక్కడ పెట్టడం ఆనందదాయకం' అని ప్రసంగించారు.

సైరాను ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు..
నా జిల్లాకు వచ్చాను నన్ను ఆదరిస్తున్నారు, అక్కున చేర్చుకుంటున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సైరా చిత్రాన్ని ఆదరించిన విజయం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నేనొస్తున్నని తెలిసి ఎండను సైతం లెక్కచేయకుండా ఇక్కడకు వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.


Click it and Unblock the Notifications











