చిత్రాంగద సింగ్ కోరిక తీర్చేవారెవరు??
ముంబై : అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నేతలూ తమ పార్టీకే ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర దేవుళ్లను వేడుకోవడానికి ప్రతి ఇల్లు, వీధి తిరిగి ప్రచారం చేస్తారు. ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలను ఓట్లు అడిగే రాజకీయ నాయకుల ఆహార్యం ఆకర్షణీయంగా, హుందాగా ఉంటే బాగుంటుందని ప్రముఖ బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్ పేర్కొంటున్నారు.
మన దేశంలో రాజకీయ నాయకులంటే తెల్లటి ఖద్దరు పైజామా-లాల్చీ వేసుకున్న వారే మన మదిలో మెదులుతారు. ఎల్లప్పుడూ ఇవే వస్త్రాలు ధరించనవసరంలేదని, మన యువ రాజకీయ నేతలు జీన్స్, టీ షర్టులు వేసుకుంటే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు నటి చిత్రాంగదా సింగ్. ఈమె బాలీవుడ్లో నటించింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ తన అభినయంతో స్మితా పాటిల్ను గుర్తుకు తెస్తుందనే ప్రశంసలు అందుకున్నారీమే.
హుందాగానూ, ఆధునికంగానూ ఉండే దుస్తులను ధరించే చిత్రాంగద మన యువ రాజకీయ నాయకులు కూడా పురాతన వస్త్రధారణను వీడి ఆధునికంగా ఉంటే ఇంకా బాగుంటుందన్నది ఈమె ఉద్ధేశం. ఈమె దృష్టిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి సచిన్ పైలెట్లు ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణీయంగా ఉండే దుస్తులను ధరించే యువ నేతలు. ఈ రాజకీయనేతలిద్దరూ వరసకు బావ, బావమరుదులు కావడం విశేషం. ఒమర్ అబ్ధుల్లా చెల్లెలు సారాను సచిన్ పైలెట్ ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఎన్నికల సమయంలో తప్ప రాజకీయ నాయకులను ప్రతి రోజూ చూసే భాగ్యం సాధారణ ప్రజలకు దక్కదు. నాయకులు ఏదైనా ప్రత్యేక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడానికి వచ్చినప్పుడు మాత్రమే వారిని చూసే అదృష్టం స్థానికులకు లభిస్తుంది. కానీ ఎన్నికల సమయంలో మాత్రం దీనికి భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications












